ప్రపంచం అబ్బురపడేలా కొత్త సచివాలయం: మంత్రి వేముల

182
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో పురోగతి పరిశీలించారు.అధికారులను రోజువారీ వర్క్ చార్ట్ అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ ప్రాంగణం అంతా మంత్రి వేముల అధికారులతో కలిసి కలియతిరుగుతూ పలు సూచనలు చేశారు.అనంతరం సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆర్ అండ్ బి అధికారులు,నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచం అబ్బురపడేలా అన్ని వసతులు, అన్ని సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన ఒక సెక్రటేరియట్ భవనం ఉండాలని నూతన భవనం నిర్మాణ పనులు ఆర్ అండ్ బి శాఖ అద్వర్యంలో పనులు మొదలై,శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థ షాపూర్ జి వారు పనుల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇక్కడ 2500 మంది కార్మికుల వసతి కోసం మంచి అధునాతన సౌకర్యాలతో,పరిశుభ్రమైన వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేశారు.నిర్మాణానికి కావాల్సిన కాంక్రీటు బయటి నుంచి తెప్పించుకోకుండా నిర్మాణప్రాంతంలోనే రెడీ మిక్స్ ప్లాంట్(బ్యాచింగ్ ప్లాంట్) నెలకొల్పారు.

ఈ ఇన్ బిల్ట్ నుంచి రోజుకు 300 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు అంటే దాదాపు 2500 సిమెంట్ బస్తాల కాంక్రీటు తయారీ ఇక్కడే చేస్తున్నారు. సెక్రటేరియట్ మెయిన్ బిల్డింగ్ కు గుంతల తవ్వకాలు జరుగుతున్నాయి.. చరిత్రాత్మకంగా నిలిచే సెక్రటేరియట్ నిర్మాణం 150 ఏళ్ల పైగా ఉంటుంది. కాబట్టి భూకంపాలను సైతం తట్టుకునే విధంగా,స్ట్రాంగ్ గా నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.వారి ఆదేశాల మేరకు ఆర్కిటెక్ట్, స్ట్రక్చర్ ఇంజినీర్స్ ను,ఐఐటీ ఫ్రొఫెసర్స్ ను సంప్రదించి వెట్టింగ్ చేయించి మరి డిజైన్లు రూపొందించాం.భవనానికి దాదాపు 200 ఫుట్టింగ్(పిల్లర్లు) ఉంటాయి.

ఒక్క ఫుట్టింగ్(పిల్లర్)కు 300 బస్తాలు సిమెంట్ అంటే 40 క్యూబిక్ మీటర్లు కాంక్రీటు,4టన్నుల స్టీల్ పడుతుంది.అంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఎంతైతే సిమెంట్, కాంక్రీటు, స్టీల్ పడుతుందో..సెక్రటేరియట్ భవనం ఒక్క ఫుట్టింగ్ కు అంత పడుతుంది.దీన్ని బట్టి నిర్మాణం ఎంత స్ట్రాంగ్ గా జరుగుతుందో అర్ధమవుతుంది. నిర్మాణం క్వాలిటీ లో ఎక్కడా రాజీ లేకుండా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 12 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.వారి ఆలోచనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి పర్యవేక్షణలో చురుగ్గా జరుగుతున్నాయి.తెలంగాణ ఖ్యాతిని చాటే విధంగా నిర్మాణం ఉంటుందని భావిస్తున్నాను. సచివాలయ నిర్మాణ పనులు మా ఆర్ అండ్ బి శాఖ పూర్తి నాణ్యతతో తొందరలో పూర్తి చేస్తుంది.” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంత్రి వెంట ఈఎన్సీ గణపతి రెడ్డి, సెక్రటేరియట్ ఎస్.ఈ సత్యనారాయణ,పలువురు ఆర్ అండ్ బి అధికారులు,వాస్తు నిపుణులు సుధాకర్ తేజ,షాపూర్ జి నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -