భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాధికారుల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు రెండు దేశాలూ దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంబంధిత అంశాలపై సుహృద్భావ వాతావరణంలో అర్ధవంతమైన చర్చలు జరుపుతున్నాయని చైనా తెలిపింది. రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునైంగ్ పేర్కొన్నారు.
ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్ 6న రెండు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల మధ్య భేటీ జరిగింది. తూర్పు లడఖ్, ప్యాంగాంగ్ సెక్టార్లలోని చైనా బలగాలు వెనక్కు మళ్తున్నాయని, విరమణ ప్రక్రియ ప్రారంభమైందని మంగళవారం భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ క్రమంలోనే చైనా నుంచి తాజా ప్రకటన వెలువడింది. ఇరువర్గాలు సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉద్రిక్త వాతావరణాన్ని సడలించడానికి రెండు వైపుల నుంచి ఏకాభిప్రాయం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి అన్నారు.