భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా ఉన్న యువతతో (జెన్ జెడ్ – Gen Z) అనుసంధానాన్ని బలోపేతం చేసుకునేందుకు గాను ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి, ఛత్తీస్గఢ్ మంత్రి ఓ.పి. చౌదరిలతో పాటు పలువురు ముఖ్య నాయకులను ఈ బృందంలో చేర్చారు
యువత (Gen Z) ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలు మరియు నిరీక్షణలను అర్థం చేసుకోవడం, అలాగే బీజేపీ నాయకులతో నేరుగా చర్చించేందుకు వారికి వేదిక కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
యువ ఓటర్లతో సంబంధాలను సుదృఢం చేయడానికి సదస్సులు, చర్చా వేదికలు మరియు వివిధ రకాల భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ నేతలతో పాటు యువ నాయకులను కలిపి ఈ టీమ్ను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త తరం ఓటర్లకు మరింత దగ్గరవ్వాలని పార్టీ భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ఫార్మాట్ను త్వరలోనే ప్రకటించనున్నారు
ఈ బృంద ఏర్పాటు ప్రకటనకు ముందు కొత్తగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల తొలి పరిచయ సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగింది. వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ సమావేశంతో నూతన పదాధికారుల కొత్త ఇన్నింగ్స్ అధికారికంగా ప్రారంభమైంది.అలాగే బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్లను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగించగా.. స్మృతి ఇరానీ, బిప్లబ్ కుమార్ దేవ్, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలను కొత్త జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు జాతీయ కోశాధికారి (ట్రెజరర్) బాధ్యతలు అప్పగించారు.
Also Read:ట్రంప్తో వాణిజ్య చర్చలు రద్దు!

