కొన్ని నెలలుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ.. కొత్త ఎత్తులకు వెళ్లిన సెన్సెక్స్ ఒక్కసారిగా పాతాళాన్ని తాకింది. అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కేవలం కొద్ది గంటల్లోనే లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఆరంభంలో 1200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 34వేల దిగువకు పడిపోయింది. ప్రముఖ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ 976 పాయింట్లు కోల్పోయి 33, 781 వద్ద, నిఫ్టీ 294 పాయింట్లు నష్టపోయి 10,372 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
టాటామోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, మారుతి సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు భారీ నష్టంతో కొనసాగుతున్నాయి. ఇక అమెరికా విషయానికొస్తే ట్రేడింగ్లో వాల్ స్ట్రీట్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక దశలో 1600 పాయింట్లు దిగజారి 25వేల కిందకు చేరింది. ఎస్ అండ్ పీ 500 కూడా భారీ నష్టాలను చవిచూసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి సాధించిన లాభాలను ఒక్కరోజులో కోల్పోయింది.
స్టాక్ మార్కెట్ల ప్రభావంతో రూ.7 లక్షల 32 వేల కోట్లు ఆవిరైనట్లు బ్లూమ్బర్గ్ అంచనా వేసింది. ఇందులో బెర్క్షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్ అత్యధికంగా సుమారు 500 కోట్ల డాలర్లు (సుమారు రూ.32 వేల కోట్లు) నష్టపోవడం గమనార్హం. బఫెట్ తర్వాత ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్బర్గ్ 360 కోట్ల డాలర్లు (సుమారు రూ.23 వేల కోట్లు) నష్టపోయాడు. అటు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా సుమారు రూ.21 వేల కోట్ల సంపదను కోల్పోయారు. ఆల్ఫాబెట్ ఓనర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు సుమారు రూ.15 వేల కోట్ల మేర నష్టపోయారు. 2011 ఆగస్ట్ తర్వాత డౌ జోన్స్ 1175 పాయింట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.