అతి తక్కువ ధరతో అంబుబాటులోకి తీసుకొస్తున్న జియో 4జీ ఫీచర్ ఫోన్ కొద్దిరోజుల్లో కస్లమర్లకు అందనున్నాయి. గతనెల 24,25న సుమారు 60 లక్షల ఫోన్లు బుక్కయ్యాయి. రూ.1500లకే జియో ఫీచర్ఫోన్ వస్తున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనిలో భాగంగా ఎయిర్టెల్ 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం దీనికి ఉంటాయని టెలికం ఇండస్ట్రీ నిపుణులు వ్యాఖ్యానించారు. అధిక మొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ, ఈ ఫోన్ ను ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో తీసుకువస్తున్నట్టు ఎయిర్ టెల్ వర్గాలు వెల్లడించాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అన్ని రకాల యాప్స్ నూ వాడుకోదగ్గ ఈ ఫోన్ దసరా, దీపావళి పండగ సీజన్ లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. ఎయిర్టెల్ తీసుకురానున్న 4జీ స్మార్ట్ఫోన్ ధర రూ.2500-2700 మధ్య ఉండే అవకాశం ఉందని టెలికాం వర్గాల సమాచారం.అయితే ఇప్పటివరకూ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా, ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. అయితే, డీల్ కుదిరిందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం ఈ కంపెనీలు వెల్లడించలేదు. జియోతో పోటీని ఎదుర్కోవాలంటే, అదే వ్యూహం తప్పదని భావిస్తున్న ఎయిర్ టెల్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు టెలికం వర్గాల సమాచారం.