ప్రముఖ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులకు భారీ షాకివ్వనున్నాయి. భారత్లో త్వరలో మొబైల్ వినియోగదారుల ఫోన్ బిల్లులు మోత మోగనున్నాయి. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచాయి. ఇప్పుడు మరోసారి ప్రీపెయిడ్ ఛార్టీలను భారీగా పెంచనున్నాయి. దేశీయ టెలికాం కంపెనీలు ఈ ఏడాది దీపావళి నాటికి 10 నుంచి 12 శాతం ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమయ్యాయి.
దీంతో పెరిగిన ధరల కారణంగా యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం ఎయిర్ టెల్ రూ.200, జియో రూ.185, వొడాఫోన్ ఐడియా రూ.135 పెరుగుతుందని ఇండియా యూనిట్కు చెందిన ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియం ఓ’ నీల్ & కో ప్రతినిధి మయూరేష్ జోషి తెలిపారు.
గతేడాది నవంబర్లో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ టారిఫ్ ధరల్ని 20 నుంచి 25శాతం వరకు పెంచాయి. జియో సైతం అదే తరహాలో పెంచింది. దీంతో ఎక్కువ మంది వినియోగించుకునే లో టైర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.79 ని రూ.99కి చేరింది. దీంతో పాటు ఎయిర్టెల్ 84రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా ప్యాక్ రూ.698 నుంచి రూ.839కి చేరింది.