అయోధ్య రామ మందిర విరాళాల చోరీ, అక్రమాల ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తును పూర్తి చేసింది. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికతో పాటు తదుపరి తీసుకోవాల్సిన చర్యల ప్రణాళికలను ఉత్తరప్రదేశ్ హోంశాఖ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు సమర్పించింది.
లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల SIT ఈ దర్యాప్తు చేపట్టింది. ఇందులో ఐజీ రేంజ్ కిరణ్ ఎస్, ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక శాఖ) నీల్ రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం జూన్ 23న ప్రాథమిక నివేదికను సమర్పించింది.
SIT ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్ 25న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో తొలి FIR నమోదైంది. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 90/2026గా నమోదైన ఈ కేసులో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు.
నిందితులపై IPCలోని 305, 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) సెక్షన్లతో పాటు PC Actలోని 13(1)(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, ఒక తుది నిర్ణయానికి తీసుకురావాలని సుప్రీంకోర్టు గతంలో SITను ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు పురోగతిపై సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని SITను ఆదేశించింది.
Also Read:ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తం!
ఫోరెన్సిక్ ఆడిటర్ కూడా ఉన్న SIT.. దర్యాప్తు పురోగతిపై నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ముందుగా ఆ నివేదికను పరిశీలించి, అనంతరం దానిని అన్ని పక్షాలకు విడుదల చేయాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

