JSSC-CGL రద్దుపై ఉద్యోగుల నిరసన

1
- Advertisement -

జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం మరోసారి నిరసనలను ఎదుర్కొంటోంది. 2014 నుంచి నిర్వహించిన JSSC-CGL పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు తాజాగా ఆందోళనకు దిగారు. విద్యార్థుల వారాల తరబడి సాగిన నిరసనల నేపథ్యంలో నియామక పరీక్షను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్న తమను పరీక్ష రద్దు పేరుతో తొలగించవద్దని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. రాంచీలోని ప్రాజెక్ట్‌ భవన్‌ వెలుపల వారు నిరసన చేపట్టి తమ నియామకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.విద్యార్థుల ఆందోళన ఒత్తిడితోనే ప్రభుత్వం JSSC-CGL పరీక్షను రద్దు చేసిందని నిరసనకారులు ఆరోపించారు. నియామక ప్రక్రియ ద్వారా ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను కేవలం మౌఖిక ప్రభుత్వ ఆదేశంతో రద్దు చేయడం సాధ్యం కాదని వారు వాదించారు.

ఈ వ్యవహారంపై తుది నిర్ణయం న్యాయస్థానంలోనే వెలువడుతుందని, తమ ఉద్యోగాల కోసం చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. నిరసనకారుల్లో ఒకరైన చందా కుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది నిర్దోషి అభ్యర్థులు ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడ్డారని అన్నారు. తప్పు చేసిన వ్యక్తికి బదులుగా నిర్దోషిని శిక్షించకూడదన్న సూత్రాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినంత మాత్రాన మొత్తం పరీక్షను రద్దు చేయడం సరైన పరిష్కారమా? అని ప్రశ్నించారు.

గత 24 రోజులుగా ప్రభుత్వం వివాదంలో ఒక వర్గం వాదన మాత్రమే విన్నదని, ఇప్పటికే నియమితులైన ఉద్యోగులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.2014 నుంచి నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలన్న నిర్ణయం వల్ల సుమారు 2,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని JSSC-CGL ద్వారా నియమితులైన ఉద్యోగులు చెబుతున్నారు.

తాము నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులై, అధికారికంగా నియామకాలు పొంది, ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. నియామక ప్రక్రియలో జరిగినట్లు చెబుతున్న అవకతవకల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని, అలాంటి ఆరోపణలకు తమను బాధ్యులను చేసి ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని వాదించారు.

Also Read:ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తం!

- Advertisement -