పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026’ ను లోక్సభ బుధవారం పరిశీలన మరియు ఆమోదం కోసం చేపట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు.
వర్షాకాల సమావేశాల తొలిరోజైన జులై 20న విపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్యే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపు: ఈ బిల్లు చట్టంగా మారితే, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (CJI) మినహా మిగిలిన న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెరుగుతుంది.
ప్రధాన న్యాయమూర్తితో కలిపి సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి చేరుతుంది. ఈ ఏడాది మే 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకువచ్చింది.సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల కేసుల వేగవంతమైన పరిష్కారానికి, విస్తృత రాజ్యాంగ ధర్మాసనాలను క్రమబద్ధంగా ఏర్పాటు చేసేందుకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది.
సభలో ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో, అంతకుముందు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ ఎంపీలు సౌగతా రాయ్, ఎన్.కె. ప్రేమచంద్రన్, డీన్ కురియాకోస్లు ప్రవేశపెట్టిన చట్టబద్ధమైన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం బిల్లుతో పాటే చర్చకు తీసుకోనుంది.రైల్వేల మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ సిఫార్సుల అమలు పురోగతిపై రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ సభలో ప్రకటన చేయనున్నారు.
Also Read:ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సోనమ్ భార్య
కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు..2026పై ఏర్పాటైన ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పణ గడువును వర్షాకాల సమావేశాల చివరి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనపై సభ నిర్ణయం తీసుకోనుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.

