NEET పేపర్ లీక్ వ్యవహారం మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న నిరసనలు 32వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నల్లా, ప్రధానమంత్రి కార్యాలయ (PMO) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రికి వెళ్లి సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఇకపై ప్రభుత్వం నుంచి తమతో ఎలాంటి చర్చలు ఉండవని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రకటించిన తర్వాతి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. జూన్ 28 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను దిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం సాయంత్రం సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, తదుపరి చికిత్స నిమిత్తం గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన దిల్లీ హైకోర్టు, ఆయనను తక్షణమే మేదాంత ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.
భారీ భద్రత మధ్య అంబులెన్స్లో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వాంగ్చుక్ను మేదాంత ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇంటర్నల్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ సుశీల కటారియా పర్యవేక్షణలో ఆయనను ICU 8లో చేర్పించినట్లు మేదాంత ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి వేరే చోటికి తరలించినప్పటికీ ఆయన తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ మార్చ్ సమయంలో జరిగిన హింసాత్మక ఘర్షణల మరుసటి రోజు వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు మళ్లీ ఆందోళనను పునరుద్ధరించడానికి జంతర్ మంతర్కు చేరుకున్నారు.
Also Read:ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సోనమ్ భార్య
పరీక్షల వ్యవస్థలో పేపర్ లీక్లు, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం స్వచ్ఛందంగా ఉద్భవించింది. దేశంలోని యువతను “కాక్రోచ్లు” (బొద్దింకలు) అని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్య కాంత్ సంబోధించినట్లు వచ్చిన ఒక వ్యాఖ్య ఆధారంగా దీనికి ఆ పేరు వచ్చింది. జూన్ 20 నుంచి ఈ పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మరియు వామపక్ష విద్యార్థి సంఘం (AISA)కి చెందిన విద్యార్థుల బృందం నిరాహార దీక్షలో చేరడంతో ఈ నిరసనకు మరింత మద్దతు లభించింది.

