మహిళలను ‘అంటరాని’గా చూడలేం!

5
- Advertisement -

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై జరుగుతున్న కీలక విచారణలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీవీ నాగర్తన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను నెలలో మూడు రోజులు “అంటరాని”గా పరిగణించి, నాలుగో రోజున అకస్మాత్తుగా అలా కాకుండా చూడటం సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
మహిళలపై మతపరమైన ఆంక్షలు, లింగ వివక్ష అంశాలపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ఇందులో శబరిమల ఆలయంతో పాటు వివిధ మతాల ఆరాధనా స్థలాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి.

ఈ ధర్మాసనానికి జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, 2018లో అప్పటి న్యాయమూర్తి చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. మహిళల ప్రవేశంపై నిషేధాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం “అంటరానితనం”గా పరిగణించడం సరైనది కాదని అన్నారు.

భారతదేశం పాశ్చాత్య దేశాలు భావించినంతగా లింగ వివక్షతో నిండి లేదు అని ఆయన పేర్కొన్నారు. శబరిమల ఆలయంలో మహిళలపై ఉన్న ఆంక్షలు మెన్స్ట్రుయేషన్ (మాసిక ధర్మం) ఆధారంగా కాదని, కేవలం వయస్సు ఆధారంగా మాత్రమే ఉన్నాయని తుషార్ మెహతా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప ఆలయాల్లో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం ఉందని, కేవలం శబరిమల ఆలయంలో మాత్రమే ఈ ప్రత్యేక నిబంధన ఉందని తెలిపారు.

2018లో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని అనుమతిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. తరువాత 2019లో, ఈ అంశాన్ని విస్తృతంగా పరిశీలించేందుకు పెద్ద ధర్మాసనానికి పంపించారు.ప్రస్తుతం, మత స్వేచ్ఛ మరియు లింగ సమానత్వం మధ్య ఉన్న సవాళ్లను సమతుల్యం చేసే దిశగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?

- Advertisement -