ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన తర్వాత కూడా యుద్ధం ముగిసిపోయిందని భావించవద్దని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. అధికారిక ప్రకటనలో…“ఇది యుద్ధానికి ముగింపు కాదు. అయినప్పటికీ, సుప్రీం లీడర్ ఆదేశాలను పాటిస్తూ సైన్యంలోని అన్ని విభాగాలు కాల్పులను నిలిపివేయాలి” అని తెలిపారు.
అమెరికాతో కాల్పుల విరమణపై ఖమేనీ జాగ్రత్త ధోరణి అవలంబించారు. ఒకవైపు సైనిక చర్యలను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ, మరోవైపు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ అన్ని సైనిక విభాగాలు కాల్పుల విరమణను గౌరవించాలి అని పేర్కొన్నారు.
అదే సమయంలో, ఇరాన్ తన బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని గట్టిగా హెచ్చరించింది. ఈ కాల్పుల విరమణను యుద్ధానికి ముగింపుగా భావించకూడదని, అమెరికా లేదా ఇజ్రాయెల్ నుంచి ఏదైనా చర్య జరిగితే వెంటనే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో, ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదించినట్లు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. అలాగే, అమెరికాతో చర్చలు ప్రారంభించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం నుంచి సమావేశాలు జరగనున్నట్లు తెలిపింది.
Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్కు హాని చేసేది ఏది?
ఇరాన్ నుంచి వచ్చిన 10 పాయింట్ల ప్రతిపాదనను స్వీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన చర్చలకు బలమైన పునాది అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు వారాల కాలంలో విస్తృత ఒప్పందం కుదిరే అవకాశముందని, అది యుద్ధానికి ముగింపు కావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

