తెలంగాణలో సుపరిపాలన అందించడమే ద్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్…తాజాగా మహబూబాబాద్ లో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ…మహబూబాబాద్ గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతమని అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతంగా అభివృద్ధిలో పురోగమిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు వరాల జల్లు కురిపించారు. మహబూబాబాద్ జిల్లాలోని అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు సీఎం చెప్పారు. జిల్లాకు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాకముందు 3, 4 వైద్య కళాశాలలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కొత్త వైద్య కళాశాలలను తెచ్చుకున్నాం. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది.
కలెక్టరేట్ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో పాటు మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, తొర్రూరు, మరిపెడ, డోర్రకల్కు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మంజూరు చేసిన ప్రతిరూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఉపయోగపడేలా చూసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చా. అప్పుడు ఇక్కడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమీ లేకపాయె. తుంగతుర్తి, వర్ధన్నపేట, పాలకుర్తి ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ సగం గీకిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావు అని చాలా బాధపడ్డా.
ఏటూరునాగారం వచ్చినప్పుడల్లా.. చిల్లర డబ్బులు వేసి తల్లీ గోదావరి మా నేలమీదకు ఎప్పుడొస్తావు, మా కరువు ఎప్పుడు తీరుస్తావు అంటూ దండం పెట్టుకునేవాడిని. తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తా అని ఐనవోలు స్వామికి మొక్కుకున్నా. స్వామి దయ, మీరు (ప్రజలు) చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్నీ కలిసి ఇప్పుడు అద్భుత రాష్ట్రం సాకారమైంది అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి…
పథకాలు కేసీఆర్వి…పన్నులు మోడీవి
ఆఫ్ఘాన్తో సిరీస్ రద్ధు…
ఏపీ సీఎం జగన్తో సోమేశ్ కుమార్ భేటీ..