యూపీలో ఈ నెల 17 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడ‌గింపు..

212
UP Lockdown
- Advertisement -

యూపీలో పెరుగుతున్న కరోనా కేసుల నియంత్ర‌ణ‌కు మే 17 న ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసేందుకు యూపీ ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. మే 14 న పంచాయతీ ఎన్నికలు, అనంత‌రం రంజాన్‌ పండుగ తర్వాత గ్రామాల్లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. తొలుత‌ ఏప్రిల్ 29 న వారాంత‌పు బంద్ చేప‌ట్టారు. తర్వాత దానిని మే 4, మే 6 వ‌రకు, ఆ తర్వాత మే 10 వరకు పొడ‌గించారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ టీం -9తో ఆదివారం జరిపిన సమీక్ష సమావేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సమయంలో అన్ని ఆంక్షలు మునుపటిలాగే అమలులో ఉంటాయని, అవసరమైన సేవలకు మినహాయింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనవసరంగా రోడ్ల‌పై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని వారు చెప్పారు. ప్రోటోకాల్‌ను క‌చ్చితంగా అమలు చేస్తేనే కరోనా కర్ఫ్యూ ప్రయోజనం విజయవంతమవుతుందని ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల దుకాణాలు, మందుల దుకాణాలతోపాటు ఈ-కామర్స్ సంస్థ‌లు ప‌నిచేయ‌నున్నాయి. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే ప‌నిచేయాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వికలాంగులు, గర్భిణులు ఇంటి నుండే పనిచేసే అవ‌కాశం కల్పించారు. కాగా గ్రామాల్లో టీకాలు వేయడం, పరిశుభ్రతా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారుల‌ను ఆదేశించింది.

- Advertisement -