సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి పీయూష్ ఫోన్..

127
piyush
- Advertisement -

కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎం కు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా 200 టన్నుల ఆక్సీజన్ ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒరిస్సా లోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సీజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సీఎం ను కోరారు. వ్యాక్సిన్లను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.

అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి తలకుమించిన భారంగా మారే పరిస్థితి వుంటుందని, అందులో భాగంగా, కరోనా నియంత్రణకోసం ఆక్సీజన్, రెమిడెసివిర్, వ్యాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తనకు ఆదేశాలు జారీచేసినట్టుగా, కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ సీఎం శ్రీ కేసీఆర్ కు వివరించారు.

- Advertisement -