TTD:మూడు భాషల్లో భగవద్గీత పుస్తకాల పంపిణీ

27
- Advertisement -

సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెద్ద ఎత్తున నిర్వహించడంలో భాగంగా భగవద్గీతను విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో రాయించి పుస్తకాలుగా ముద్రించి తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పంపిణీ చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రకటించారు. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా భగవద్గీత ను ముద్రించి ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు అందించే ఆలోచన చేస్తామని తెలిపారు. చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ గా గురువారం ఎ జె శేఖర్ రెడ్డి, సమాచార కేంద్రం లోని వేంకటేశ్వర స్వామి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.

పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్య పురుషులు, హైందవ ధర్మ పెద్దల సూచనలతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైందవ ధర్మ ప్రచారానికి కార్యాచరణకు దిగుతామని ఆయన తెలిపారు. కళ్యాణమస్తు, శ్రీవారి కళ్యాణోత్సవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళతామని ఆయన చెప్పారు. హిందూ ధర్మ ప్రచారానికి తిరుమల దేవస్థానం నాయకత్వం వహిస్తే అందరూ అనుసరిస్తారనే నమ్మకం ఉందన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి పునర్వైభవం తేవడానికి చిన్న పిల్లల్లో మానవీయ విలువలు, భక్తి విశ్వాసాలు పెంపొందించేందుకు తమ ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే రామ కోటి తరహాలో గోవింద కోటి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 25 సంవత్సరాల్లోపు వయస్సున్న వారు గోవింద కోటి రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా బ్రేక్ దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని శ్రీ కరుణాకర రెడ్డి తెలిపారు. తాను గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయం లోనే చెన్నె, కాట్పాడి మార్గాల నుండి తిరుమలకు నడచి వచ్చే భక్తుల కోసం విడిది కేంద్రాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

కారణాంతరాల వల్ల ఆగిపోయిన విడిది కేంద్రాలను ఇప్పుడు నిర్మిస్తామన్నారు. తిరుమల నడక దారిలో లక్షిత అనే బాలికను చిరుత చంపిన నేపథ్యంలో టీటీడీ,అటవీ అధికారులు అప్రమత్తమై అడవి మొత్తం జల్లెడ పట్టి 10 బోన్లు ఏర్పాటు చేశారన్నారు. ఫలితంగా ఆరు చిరుతలను బంధించామని చెప్పారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు . నడక దారిలో వచ్చే భక్తులకు భద్రత సిబ్బందిని రక్షణగా పంపడంతో పాటు, వారిలో ఆత్మ విశ్వాసం పెంచడానికి చేతి కర్ర ఇస్తున్నామని శ్రీ కరుణాకర రెడ్డి వివరించారు. ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో అనేక విమర్శలు చేసినా, భక్తులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుండి అనుమతి లభిస్తే తిరుమల నడక దారి వెంబడి ఫెన్సింగ్ నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read:టార్గెట్ 175.. నో బ్రేక్స్?

వేంకటేశ్వర స్వామి పట్ల అచంచల భక్తి విశ్వాసం, దాన గుణం ఉన్న శేఖర్ రెడ్డిని స్వామి అనుగ్రహం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో ఎల్ ఎ సి చైర్మన్ గా నియమించామన్నారు.చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ ఏజే శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలోని శ్రీవారి ఆలయం , పరిసరాలు ప్రస్తుతం 5.5 గ్రౌండ్ల స్థలంలో ఉన్నట్లు చెప్పారు. ఆలయాన్ని విస్తరించడానికి ఆలయాన్ని ఆనుకుని ఉన్న 3.5 గ్రౌండ్ల స్థలాన్ని కొనుగోలు చేశామని, మరో 1.5 గ్రౌండ్ల స్థలం కొనుగోలు చేయాల్సి ఉందని వివరించారు. మొత్తం 11 గ్రౌండ్ల స్థలంలో బ్రహ్మాండంగా శ్రీవారి ఆలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్థలం కొనుగోలు కోసం ఇప్పటి వరకు రూ. 19 కోట్లు విరాళం వచ్చిందని తెలిపారు. మిగిలిన మొత్తం దాతల నుండి సమీకరించడానికి భూదానం పథకం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

చెన్నైలోని రాయపేటలో 1.5 ఎకరాల స్థలంలో పేదలు ఉచితంగా వివాహాలు చేసుకోవడానికి కల్యాణ మండపం పనులకు త్వరలో భూమి పూజ చేయనున్నామన్నారు.కన్యాకుమారి, తిరుచ్చి, మధురై ,కోయంబత్తూరులో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామన్నారు.వేలూరులోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

- Advertisement -