హైదరాబాద్‌లో 2679 కోట్లతో ఆస్పత్రుల నిర్మాణం.. ఉత్తర్వులు జారీ..

44
cm kcr
- Advertisement -

తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుదిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలో 2679 కోట్లతో ఆస్పత్రుల నిర్మాణం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనపరమైన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. 900 కోట్లతో ఎల్బీ నగర్, 882 కోట్లతో సనత్ నగర్, 897 కోట్లతో అల్వాల్ ఆసుపత్రులను నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు జీవో ఎం. ఎస్ .41లో పేర్కొంది. ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలోను సూపర్ స్పేషాల్టీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్ అండి బీ శాఖను ఆదేశిస్తు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఎస్ ఐడీసీని, డీఎంఈలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ ఆసుపత్రులకు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

నగర శివార్లలో నలు దిక్కులా నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు నిర్మాణం అయితే పెద్ద సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లపై ఒత్తిడి తగ్గనుంది. గచ్చిబౌలి, అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్లలో నిర్మించే ఈ ఆసుపత్రుల నిర్మాణం వల్ల జిల్లాల నుంచి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవచ్చు.అల్వాల్‌లో ఏర్పాటు చేసే ఆసుపత్రికి సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోగులు చక్కటి వైద్యం పొందే అవకాశం ఉంది. అదే రీతిలో ఎల్బీనగర్ ఆసుపత్రి కి ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల నుంచి రోగులు వైద్యం పొందే వీలుంది.

అదే రీతిలో గచ్చిబౌలి, సనత్ నగర్ ఆసుపత్రులకు దగ్గరి జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. గతంలో ఏదైనా అత్యవసర వైద్య సేవలు కావాలంటే నిమ్స్ కో, గాంధీకో తరలించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ట్రాఫిక్ కారణంగా అందాల్సిన వైద్యం సకాలంలో అందక రోగులు చనిపోయిన సందర్బాలు ఉన్నాయి. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే జిల్లాల నుంచి అత్యవసర వైద్య సాయం కావాల్సిన రోగులకు ట్రాఫిక్ బెడద లేకుండా నగర శివార్లలోనే అత్యుత్తమ అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుంది. దీంతో పాటు గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల ఒత్తిడి తగ్గుతుంది.

- Advertisement -