టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి అని ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వరంగల్ జిల్ల ప్రకాశ్ రెడ్డి పేటలో జరిగే ప్రగతి నివేదన సభ వద్ద ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన కవిత.. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని చెప్పారు. సీఎం అమలు చేస్తున్న పథకాలతో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బదులు తెలంగాణ రైతు సమితి అని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఏది చేసినా విజయవంతమేనని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణకు వరంగల్ నగరం ఉద్యమ దిక్సూచిగా నిలిచిందన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఓరుగల్లు నగరంలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగడం సంతోషాన్నిస్తుందన్నారు కవిత.
అభివృద్ధే తమ నినాదమని ఉద్ఘాటించారు కవిత. బంగారు తెలంగాణ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రకటించారు. కేసీఆర్ ప్రసంగం కోసం రైతులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. నేటి సభలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే.. భవిష్యత్లో చేపట్టబోయే కార్యక్రమాలను గురించి సీఎం వివరిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన భారీ బహిరంగ సభలలో ఎక్కువగా వరంగల్ లోనే జరిగాయి. 2001 ఏఫ్రిల్ 27 పార్టీ ఆవిర్భావం తర్వాత 2001 జూన్ 21వ తేదీన హన్మకొండ కేడిసి మైదానంలో తొలి బహిరంగసభ జరిగింది. ఆ తర్వాత 2002 అక్టోబర్ 28 న భూపాలపల్లిలో బహిరంగసభ జరిగింది. 2003 లో టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పది లక్షల మంది తో హన్మకొండ ప్రకాశ్ రెడ్డిపేటలో బహిరంగసభను అప్పట్లో ఘనంగా నిర్వహించారు. 2003 మే 12న జనగామ గడ్డపై పోరుగల్లు వీరగర్జన పేరుతో సభను నిర్వహించారు. తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 2005 జులై 17న భారీ బహిరంగసభను నిర్వహించారు.