రైతులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది. ఈ విధానంలో భాగంగా వ్యవసాయ రంగంలో వన్ స్టాప్ షాప్ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో విత్తనం నుంచి పంట కోతల వరకు రైతులకు కావాల్సిన వనరులను ఒకే చోట లభించేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లి హాకా భవన్లో టీఎస్ ఆగ్రోస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాములు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విత్తన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, పనిముట్లు, యంత్ర పరిశ్రమలు ప్రతినిధులు ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, వన్ నేషన్-వన్ మార్కెట్ తరహాలో వన్ స్టాప్ షాప్ సేవలు అందించేందుకు అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రధాన ఆహార పంట వరి సహా మొక్కజొన్న, మిరప, పత్తి, పప్పుధాన్యాలు, ఇతర పంటల విత్తనాలు ట్రాక్టర్లు, హర్వెస్టర్లు, ప్లాంటర్లు, ఇతర భూసార పరీక్షల సేవలు సైతం ఒకే చోట లభించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందికి శిక్షణ కూడా ఇప్పించాలని నిర్ణయించారు.
భారత ప్రధాని మోదీ గతేడాది అక్టోబర్లో వన్ నేషన్- వన్ ఫెర్టిలైజర్ స్కీం ను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకం ప్రారంభించడం వల్ల భారత్ యూరియా, భారత్ డీఏపీ, భారత్ ఎంఓపీ, భారత్ ఎన్పీకే వంటి పేర్లతో అమ్మకాలు జరగనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన బ్యాగ్ డిజైన్ ఉండటం వల్ల రైతులకు హేతుబద్దీకరణ జరుగుతుందన్నారు. ఎఫ్సీఓ నిర్ధేషించిన పోషకాలను కలిగి ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో తొలిసారిగా తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న దృష్ట్యా పల్లెల్లో చిల్లర మార్కెట్లో టీఎస్ ఆగ్రోస్ బ్రాండ్పై విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఉత్పత్తులు విక్రయించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి…