కేంద్రంతో కేటీఆర్ చర్చ.. ‘బాయిల్డ్ రైస్’ కనుమరుగు..

111
- Advertisement -

రాష్ట్రంలో ఇప్పటికే సాగయిన వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలని, రానున్న యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంపై ముందుగానే స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ట్ర రైతాంగం ఎదుర్కుంటున్న ఇబ్బందులు తదితర వ్యవసాయం సంబంధిత అంశాలపై పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ఆధర్యంలోని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారుల బృందం మంగళవారం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ తో న్యూఢిల్లీలో మంత్రి కేటీఆర్ బృందం విడివిడిగా సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపింది.సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు మంత్రి కేటీఆర్ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (ముగ్గురు మంత్రులు) తో పాటు రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ పక్షనేత ఎంపీ కె.కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, కొత్తా ప్రభాకర్ రెడ్డి లు (పదిమంది ఎంపీలు) వారితో పాటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్ రావు లతో కూడిన ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా, తెలంగాణ రైతు ఈ వానాకాలంలో పండించిన వరిధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టతనివ్వలేదు.. కాగా, వచ్చే యాసంగి బాయిల్డ్ రైస్ ను కొనబోమని మరోసారి ఖరాఖండిగా తేల్చి చెప్పింది. మామూలు బియ్యాన్ని ఎంతకొంటామనే విషయాన్ని ఈనెల 26వ తేదీన స్పష్టం చేస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన డిమాండు మేరకు ధాన్యం కొనుగోలు పరిమితిని మరింతగా పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ వరిసాగు విస్తీర్ణం మీద కేంద్రం ఓ స్పష్టతకు వచ్చింది. 62 లక్షల 13 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు వరిధాన్యాన్ని సాగుచేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ వరి సాగు విస్తీర్ణాన్ని 58 లక్షల 66 వేల ఎకరాలుగా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. అయినా ఎంత వరిధాన్యాన్ని కొనే అంశాన్ని కేంద్రం పెండింగులో పెట్టింది.

మంగళవారం ఢిల్లీలో పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ బృందం, వ్యవసాయం ధాన్యం కొనుగోలు అంశాలపై కేంద్రంతో చర్చల సందర్భంగా లేవనెత్తిన అంశాలపై ఈనెల 26వ తేదీన మరింత స్పష్టతతో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు, ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎంపీలు రాష్ట్ర ఉన్నతాధికారుల బృందంతో ఈనెల 26వ తేదీన మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మరోసారి సమావేశం కానున్నారు.

కాగా…ప్రతి ఏటా ఎంత ధాన్యం కొంటామనే విషయంలో వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్ ను ముందస్తుగానే ప్రకటించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింపచేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభిప్రాయ పడింది. మంత్రి వర్గ బృందంతో చర్చల సందర్భంగా ఈ మేరకు సీఎం కేసీఆర్ సూచనను కేంద్రం అభినందించింది. ఇక నుంచి వార్షిక వరిధాన్యం కొనుగోలు వివరాలను ముందస్తుగానే ప్రకటిస్తామని, రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్ఠం చేసింది. ఒక్క తెలంగాణకే కాకుండా ఈ నూతన విధానాన్ని అన్ని రాష్ట్రాలకూ వర్తింపచేస్తామన్నది. కాగా.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే వరకు రాష్ట్ర రైతాంగం తొందర పడకుండా యాసంగి వరి విషయంలో వేచి చూడాలని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

- Advertisement -