ముంబై..పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్‌

30
- Advertisement -

తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముంబైలో పారిశ్రామికదిగ్గజాలతో భేటీ ఆయ్యారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు పారిశ్రామిక వేత్తలను కోరారు. టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్‌, జిందాల్ గ్రూప్‌ ఎండీ సజ్జన్ జిందాల్‌ మరియు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్ మెహతాతోనూ సమావేశమయ్యారు.

టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్ లో మంత్రి కేటీఆర్ సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్… తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ ను కేటీఆర్ కోరారు. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని తెలిపిన కేటీఆర్, టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్ కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన కేటీఆర్… ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో… హైదరాబాదులో ఒక ఎమ్మార్వో (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.

తెలంగాణలోని వివిధ రంగాల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని తెలిపిన టాటా చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, రాష్ట్రంలో తమ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపట్ల అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉంటుందని తమ సంస్థ అనుభవం నిరూపించిందన్న చంద్రశేఖరన్, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో కచ్చితంగా తెలంగాణకు కీలకమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల వంటి అనేక ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.

మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపార విజయవంతమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జిందాల్ ని కేటీఆర్ కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సేయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న చత్తీస్ ఘడ్ లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు.

జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. జిందాల్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్ ని కేటీఆర్ కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పాలసీల గురించి తమకు అవగాహన ఉన్నదన్న సజ్జన్ జిందాల్, కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

అనంతరం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో ఇతర సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

పామ్ ఆయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తోందని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు కేటీఆర్. ఆ తరువాత ఆర్పీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయంకా తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమై, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.

ఇవి కూడా చదవండి…

ప్రజల ఆలోచన సరళి మారాలి..

సుపరిపాలన ధ్యేయంగా పని చేస్తున్నాం..

పతంగులు ఎగురేసుడు బంద్‌…

- Advertisement -