బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

0
- Advertisement -

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మందాన కేవలం 2 పరుగులకే అవుటైంది. అయితే, మరో ఓపెనర్ షఫాలీ వర్మ, ప్రతికా రావల్ (24 బంతుల్లో 20) తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. పదో ఓవర్‌లో ప్రతికా అవుటైనా, షఫాలీ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన షఫాలీ వర్మకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (28 బంతుల్లో 24 అజేయం), రిచా ఘోష్ (16 బంతుల్లో 21), దీప్తి శర్మ (6 బంతుల్లో 13) తగిన సహకారం అందించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు దిలారా అక్తర్ (26 బంతుల్లో 21), జువైరియా ఫెర్డోస్ (18 బంతుల్లో 14) మొదటి 5 ఓవర్లలో 26 పరుగులు చేశారు. కానీ, ఆ తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. శోభనా మోస్తారీ (18), నిగర్ సుల్తానా (19), స్వర్ణ అక్తర్ (22 నాటౌట్), ఫహిమా ఖాతూన్ (14) పోరాడినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీసింది. నందని శర్మ 2 వికెట్లు తీయగా, శ్రీ చరణి, ప్రేమ రావత్ చెరో వికెట్ పంచుకున్నారు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. రెండు జట్ల స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం కష్టంగా మారిందని పేర్కొంది. “బ్యాటింగ్ సమయంలో మేము నెలకొల్పిన భాగస్వామ్యాలు, రిచా ఘోష్ ఆడిన షాట్లు చాలా కీలకమైనవి. బౌలింగ్‌లో దీప్తి శర్మ అత్యద్భుతంగా రాణించి, జట్టుకు అవసరమైనప్పుడల్లా బ్రేక్‌త్రూలు ఇచ్చింది” అని కౌర్ కొనియాడింది.

Also Read:అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం

ఈ విజయంతో భారత జట్టు ఆదివారం దుబాయ్‌లో జరగబోయే ఆసియా కప్ 2026 ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.

- Advertisement -