గోవధ..సుప్రీంకు తమిళనాడు!

3
- Advertisement -

తమిళనాడులో ఆవులు మరియు దూడల వధపై పూర్తి నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బుధవారం నాడు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చట్టపరమైన నిబంధనలను అతిక్రమించి హైకోర్టు ఈ విధమైన సంపూర్ణ నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

తమిళనాడు జంతు సంరక్షణ చట్టం, 1958 ప్రకారం.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి….పనులకు లేదా సంతానోత్పత్తికి పనికిరాని ఆవులను, సంబంధిత అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగా వధించడానికి అనుమతి ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హైకోర్టు తీర్పు ఈ చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది.

జంతు హింస నివారణ చట్టం 1960, జంతు హింస నివారణ (కసాయిఖానా) నిబంధనలు 2001, తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల చట్టం 1998 మరియు తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల నిబంధనలు 2023 వంటి ఇతర చట్టాలు జంతువులను ఏ నిబంధనల ప్రకారం వధించాలో నియంత్రిస్తాయే తప్ప, పూర్తిగా నిషేధించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

హైకోర్టు ఇటువంటి సంపూర్ణ నిషేధాన్ని విధించడం ద్వారా చట్టసభలు చేసిన చట్టాన్ని పక్కనబెట్టి ‘న్యాయవ్యవస్థే కొత్త చట్టాన్ని తయారు చేసినట్లు’ అయిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. చట్టంలో ఉన్న పరిధిని దాటి హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని వాదించింది. మే 27న జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ మరియు జస్టిస్ వి. లక్ష్మీనారాయణలతో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. జంతువుల వధ అనేది కేవలం ప్రభుత్వం గుర్తించిన కసాయిఖానాలలో మాత్రమే జరగాలని పేర్కొంటూనే.. బక్రీద్ పండుగ రోజున గానీ లేదా మరే ఇతర రోజున గానీ” ఎలాంటి ఆవు లేదా దూడ వధించబడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని…ఉన్నత పోలీసు అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలనే ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ గోవధను అరికట్టాలని కోరుతూ ‘ఇందు మక్కల్ కట్చి’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అధికారులకు వినతిపత్రం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఈ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ని ప్రస్తావించింది. ఆవులు, దూడలు మరియు ఇతర పితూరీ , బరువులు లాగే పశువుల వధను నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోందని గుర్తుచేసింది.

Also Read:డిజిటల్ ఇండియా..11 ఏళ్ల ప్రస్థానం!

తమిళనాడు జంతు సంరక్షణ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం.. ఆవు వయస్సు 10 ఏళ్లు దాటి, అది పనికి లేదా సంతానోత్పత్తికి నిరుపయోగంగా మారిందని అధికారి సర్టిఫికేట్ ఇస్తేనే వధకు అనుమతి ఉందని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 48 వెలుగులో ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని, తగిన ధృవీకరణ పత్రం పొందిన తర్వాతే అనుమతించాలని కోర్టు వ్యాఖ్యానించింది.

- Advertisement -