ఈటలకు గుర్తుల పరేషాన్..!

143
Minister etela
- Advertisement -

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్న తరుణంలో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌‌‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే నియోజకవర్గాన్ని చాపలా చుట్టేస్తూ కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ సభలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్‌ను దూషిస్తూ , ప్రజల సానుభూతి కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్‌కు ఇప్పేడు మరో కొత్త టెన్షన్ పట్టుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంచుకున్న గుర్తులు ఇప్పుడు ప్రధాన పార్టీలను ఇరకాటంలో పెడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని గుర్తులు కాషాయ అభ్యర్థి ఈటలను కంగారుపెడుతున్నాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్‌రోలర్, ట్రక్కు, రైతు ట్రాక్టర్, చపాతీరోలర్, ఆటోరిక్షా, ఇస్త్రీపెట్టె, బస్సు, లారీ వంటి గుర్తులు టీఆర్‌ఎస్‌ ఓట్ల చీలికకు కారణమయ్యాయి.

సంగారెడ్డి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తువల్లే టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయింది. ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తును తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ట్రక్కు, రోడ్‌రోలర్, ఆటో గుర్తులను తొలగించింది. అయినప్పటికీ కారు గుర్తును పోలిన చపాతీ రోలర్, రైతు ట్రాక్టర్, ఇస్త్రీ పెట్టే, లారీ, బస్సులను కావాలంటూ కొందరు స్వతంత్రులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అయితే గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆ గుర్తులను ఓటర్లకు చూపిస్తూ కన్‌ఫ్యూజ్ కాకుండా కారు గుర్తుకే ఓటేయాలంటూ అవగాహ‍న కల్పిస్తున్నారు. ఇక మరోవైపు ఇండిపెండెంట్లు ఎంచుకున్న కాలీఫ్లవర్, పైనాఫిల్, పెన్ను గుర్తులు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు గుబులు పుట్టిస్తున్నాయి.

కాలీఫ్లవర్, పైనాపిల్‌ ఇవి రెండూ దూరం నుంచి చూసినప్పుడు బీజేపీ అధికారిక గుర్తు అయిన కమలం పువ్వును పోలి ఉంటాయి. ఈ గుర్తులను ఈసీ ఆమోదిస్తే ఈటలకు చిక్కులేనని కమలనాథులు కలవరపడుతున్నారు. మరోవైపు ఓ స్వతంత్ర అభ్యర్థి తనకు కేటాయించాలని కోరిన పెన్నుపాళి(పెన్‌నిబ్‌) గుర్తు కూడా దూరం నుంచి వికసించిన కమలాన్ని పోలి ఉండటం గమనార్హం. దీంతో ఓటర్లు తికమకపడి కమలం గుర్తుకు బదులుగా ఈ మూడు గుర్తులకు ఓటేసే అవకాశం ఉందని కాషాయ పార్టీ కంగారుపడుతోంది. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులు ఎక్కడ తన విజయావకాశాలకు గండి కొడతాయోనని ఈటల రాజేందర్‌ తెగ టెన్షన్ పడుతున్నారంట..మరోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు కూడా కారు గుర్తును పోలిన గుర్తుల విషయంలో ఓటర్లకు ముందుగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -