ఈటల మేకవన్నె పులి..సర్వనాశనం అవుతడు…!

172
Minister Etela
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అవినీతి, అక్రమాలపై విజయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌ నిర్వాహకురాలు కన్న శివకుమారి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా హుజూరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ మహిళల వ్యక్తిత్వాన్ని కించపర్చే ఈటల గలీజు మెంటాలిటీని కడిగిపారేసింది. ఈటల గతంలో పౌరసరఫరాల శాఖమంత్రిగా ఉన్నప్పుడు తనకు తీరని అన్యాయం చేశారని, తీవ్రంగా వేధించారని . బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి వ్యాపారంలో మహిళలను ప్రోత్సహించేదిపోయి..కేవలం కమీషన్లు ఇవ్వలేదన కక్షతో ఈటల తన జీవితాన్ని రోడ్డుపాలుచేశాడని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు కందిపప్పు సరఫరాకు టెండర్‌ దక్కించుకొన్న తాను.. రంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలకు వంద టన్నుల పప్పును సరఫరాచేశామని, రాష్ట్రవ్యాప్తంగా సరఫరాచేద్దామనుకొన్న తరుణంలో కమీషన్లు ఇవ్వలేదని.. తన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టారని విజయలక్ష్మీ ఆరోపించారు.

సరఫరాచేసిన కందిపప్పుకు రూ.2 కోట్లు ప్రభుత్వం నుంచి రాకుండా అడ్డుపడ్డారని వెల్లడించారు. కందిపప్పు సప్లయ్‌లో కోట్ల రూపాయల అవినీతి జరుగలేదని, బిజినెస్‌ పరంగా.. ఆర్థిక పరంగా.. మానసికపరంగా నా జీవితాన్ని బజారు పాలు చేయలేదని ఇల్లందకుంట శ్రీసీతారామస్వామి వారి సాక్షిగా ప్రమాణం చేయడానికి ఈటల సిద్ధమా?’ అని శివకుమారి సవాలు విసిరారు. పౌరసరఫరాల మంత్రిగా ఉన్న సమయంలో ఈటల రెండు వేల కోట్లకుపైగా వెనకేసుకొన్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై 2014 నవంబర్‌ 14న అప్పటి విజిలెన్స్‌ కమిషనర్‌ అమిత్‌ గార్గ్‌కు ఫిర్యాదుచేశానని అయినా తనకు న్యాయం జరుగలేదని ఆమె వాపోయారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌లో కనపడని అపరిచితుడున్నాడని.. పైకి కనిపించేంత నీతిమంతుడు కాదని.. కన్న శివకుమారి మండిపడ్డారు. ఆరేండ్లుగా తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు కోట్లు ఇవ్వకుండా ఈటల తన చుట్టూ తిప్పించుకోవడమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు.

నా వెంబడి తిరుగుతున్న నా భర్తను అతను, మీ ఆయనేనా.. ఇంకెవరైనా ?’ అంటూ నా క్యారెక్టర్‌ను కించపరిచేలా వెకిలిగా కామెంట్లు చేసేవాడని శివకుమారి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అప్పుడే నాకు చనిపోవాలనిపించిందని, కోపం ఆగలేక ఓరోజు మినిస్టర్ క్వార్టర్స్‌లో ఈట‌ల‌ నెత్తిపై రెండు దోసిళ్ల దుమ్మెత్తిపోశాన‌ని, ఉసురు త‌గిలిపోతావ‌ని శ‌పించాన‌ని చెప్పారు. ఈట‌ల రాజేంద‌ర్ ఓ మేకవన్నెపులి అని, గొర్రెల మందలో తోడేలు లాంటివాడ‌ని మండిప‌డ్డారు. త‌న ఉసురు త‌గిలే ఇప్పుడు ప‌ద‌వి పోయింద‌ని, ఇంకా స‌ర్వ‌నాశ‌నం అవుతాడ‌ని తిట్టిపోశారు. .మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై విజయలక్ష్మీ అగ్రో ఇండస్ట్రీస్ నిర్వాహాకురాలు కన్న శివకుమారి చేసిన ఆరోపణలుే హుజురాబాద్‌లో సంచలనంగా మారాయి. మరి శివకుమారి విమర్శలపై ఈటల రాజేందర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -