పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ ఆటోలను ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం మంథనిలో ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దూర దృష్టి, ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూప కల్పన చేసి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఒక్క కరీంనగర్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 400 కోట్లు ప్రభుత్వం విడుదల చేశారని, మంథని లాంటి కొత్త మున్సిపాలిటీకి ఇప్పటికే రూ. 15 కోట్లు ఇచ్చారని, మరో రూ. 15 కోట్లు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారని మంత్రి తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విడుదల చేశారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. అంతకుముందు పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.