తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష నేతలతో రాష్ట్ర కార్యవర్గ సమావేశంను సీఎం కేసీఆర్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతూ…రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. నాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని సూచించారు.
మంత్రి వర్గంలో అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నామని…వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభించుకుందామని…పార్టీలోని అన్ని స్థాయిల నాయకులను కలుపుకొని పోవాలన్నారు. నియోజకవర్గాల్లో వీలైతే పాదయాత్రలు చేయాలని చెప్పారు.
మార్చి 1 నుంచి ఏప్రిల్ వరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 25న గ్రామస్థాయిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కింది స్థాయి కార్యకర్తలను సమాయత్తం చేయాలని ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను విస్తృతం చేయాలని సూచించారు.
అక్టోబర్ నెల్లో వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా నాయకులకు సీఎం కేసీఆర్ అన్నారు. ఇకపై టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండదని బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయని దీనికి అనుగుణంగా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. వీలైనన్ని ఎక్కువగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఇవి కూడా చదవండి…