అమెరికాలో ఔషధాల ధరలను స్వచ్ఛందంగా తగ్గించేందుకు గానూ భారత్కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘సన్ ఫార్మా’ సహా తొమ్మిది అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో చారిత్రాత్మక ధరల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రపంచంలోని ఇతర సమాన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు చెల్లిస్తున్న ధరల స్థాయికే అమెరికాలోనూ మందుల ధరలను తగ్గించేందుకు ఈ కంపెనీలు అంగీకరించాయి. సన్ ఫార్మాతో పాటు ఆల్కాన్ , ఆస్టెల్లాస్ ఫార్మా , బీఓన్ మెడిసిన్స్, బ్రిడ్జ్బయో, సీఎస్ఎల్, క్యోవా కిరిన్, టెవా ఫార్మాస్యూటికల్స్, యూసీబీ వంటి మధ్యస్థ స్థాయి ఫార్మా సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
గతంలోనే ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మెర్క్, ఎలీ లిల్లీ, నోవో నార్డిస్క్ వంటి 17 దిగ్గజ ఫార్మా కంపెనీలతో తమ ‘మోస్ట్-ఫేవర్డ్-నేషన్’ (MFN) ధరల విధానంపై ఒప్పందాలు కుదుర్చుకున్న ట్రంప్ బృందం, ఇప్పుడు మధ్యస్థ స్థాయి కంపెనీలపై కూడా ఒత్తిడి పెంచి ఈ ఒప్పందాల పరిధిని విస్తరించింది.
“ప్రస్తుతం దేశీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన 26 కంపెనీలు మనతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిగిలిన 10 శాతం కంపెనీలు కూడా ఒప్పందానికి వస్తున్నాయి. వారికి వేరే మార్గం లేదు” అని ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ విడత ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ధరల్లో ఇచ్చే ఈ మినహాయింపులు చిన్న, మధ్యస్థ స్థాయి కంపెనీల ఆదాయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఫార్మా రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే, వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. ఈ ఒప్పందంలో భాగంగా సన్ ఫార్మా సహా ఆయా కంపెనీలు హీమోఫిలియా, గ్లాకోమా, పార్కిన్సన్స్ వ్యాధి, కాలేయ సంబంధిత వ్యాధులు మరియు వివిధ రకాల క్యాన్సర్లకు ఉపయోగించే మందుల ధరలను భారీగా తగ్గించనున్నాయి. అలాగే రాష్ట్ర స్థాయి ‘మెడికెయిడ్’ (Medicaid) ప్రోగ్రామ్లకు MFN ధరలకే మందులను సరఫరా చేయనున్నాయి.
అమెరికాలో పెట్టుబడులు, ఉచిత విరాళాలు:
వైట్హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. సన్ ఫార్మా, ఆస్టెల్లాస్ ఫార్మా వంటి కంపెనీలు అత్యవసర సమయాల్లో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు అమెరికాలో తగినంత ఔషధ నిల్వలను అందుబాటులో ఉంచడానికి తమ ఉత్పత్తులను ‘స్ట్రాటజిక్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ రిజర్వ్’కు భారీ పరిమాణంలో ఉచితంగా విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.
దీనికి తోడు, ఈ ఒప్పందంపై సంతకం చేసిన కంపెనీలు సమీప భవిష్యత్తులో అమెరికాలోని తయారీ రంగంలో కనీసం 19.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.6 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నాయని వైట్హౌస్ వెల్లడించింది.
Also Read:రాహుల్ అసత్యప్రచారం..మోదీ ఫైర్
ఈ నిబంధనలకు అంగీకరించినందుకు ప్రతిఫలంగా, ట్రంప్ సర్కార్ విధించే దిగుమతి సుంకాలు (Tariffs) మరియు మెడికేర్ ఔషధ ధరల నూతన నిబంధనల నుండి ఈ ఫార్మా కంపెనీలకు మినహాయింపు లభించనుంది.

