పురోగతిలో అమెరికా-ఇరాన్ చర్చలు!

3
- Advertisement -

ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలు ఇంకా పురోగతిలో ఉన్నాయని అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక తప్పుడు ఒప్పందాన్ని చేసుకోబోరని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు.

ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించడానికి బయలుదేరే ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు సంబంధించిన తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నకు రూబియో సమాధానమిస్తూ..చర్చలు ఇంకా పురోగతిలోనే ఉన్నాయని నేను భావిస్తున్నాను… ఇరు దేశాల మధ్య జలసంధులను తిరిగి తెరవడం మరియు అణు అంశాలపై అత్యంత వాస్తవికమైన, గణనీయమైన కాలపరిమితితో కూడిన చర్చల్లోకి ప్రవేశించే సామర్థ్యం వంటి విషయాలపై ప్రస్తుతం ఒక బలమైన ప్రతిపాదన టేబుల్‌పై ఉంది. మేము దీనిని విజయవంతంగా పూర్తి చేయగలమని ఆశిస్తున్నాము అని చెప్పారు. ఈ చర్చలకు గల్ఫ్ భాగస్వామ్య దేశాల నుండి మంచి మద్దతు మరియు విశ్వాసం లభిస్తున్నాయని పేర్కొన్న యూఎస్ విదేశాంగ మంత్రి…ఇది ప్రపంచం కోసం జరగవలసిన సరైన పని అని అభివర్ణించారు.

అలాగే చర్చల విషయంలో తాము ఎటువంటి తొందరపాటులో లేరంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అధ్యక్షుడు చెప్పినట్లుగా ఆయనకు ఎటువంటి తొందరపాటూ లేదు, అలాగే ఆయన ఒక తప్పుడు ఒప్పందాన్ని చేసుకోబోరు. మేము ప్రత్యామ్నాయాలను పరిశీలించే ముందు దౌత్యానికి అన్ని రకాలుగా విజయవంతం అయ్యే అవకాశం ఇస్తాము. అయితే మాకు ఒక మంచి ఒప్పందం అయినా కుదరాలి లేదా మేము దీనిని మరో మార్గంలోనైనా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేము మంచి ఒప్పందాన్నే కోరుకుంటున్నాము అని రూబియో స్పష్టం చేశారు.

Also Read:మళ్లీ యోగినే సీఎం:తేజ్ ప్రతాప్

- Advertisement -