ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీకి తాను మద్దతు ఇవ్వబోనని తేజ్ ప్రతాప్ యాదవ్ స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి అక్కడ అధికారంలోకి రానుంది.
వచ్చే ఏడాది (2027) ఉత్తరప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తారని జనశక్తి జనతా దళ్ వ్యవస్థాపకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. మీర్జాపూర్ జిల్లాలోని వింధ్యాచల్లో విలేకరులతో మాట్లాడిన ఈ బీహార్ మాజీ మంత్రి.. బీహార్, ఉత్తరప్రదేశ్ రాజకీయాల మధ్య పోలికలను ప్రస్తావించారు. తాను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు మద్దతు ఇవ్వడం లేదని, 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయన గెలుస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు.
రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. “నేను అఖిలేష్ యాదవ్కు మద్దతు ఇవ్వడం లేదు… బీహార్ ఎన్నికల ఫలితాలను, మా పార్టీ ఎలా రాణించిందో అందరూ చూశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి” అని అన్నారు.
ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది.
Also Read:శక్తిమాన్గా అల్లు అర్జున్?

