గంటల నిరీక్షణ..తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఆకస్మిక మరణం కేసులో విచారణ ముగిసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.మంగళవారం ఆమె భౌతికకాయాన్ని ముంబయిలోని స్వగృహానికి తరలించారు. బుధవారం సాయంత్రం 3.30 ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని అంధేరి వెస్ట్లోని లోఖండ్వాలా సెలెబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంచుతారని ప్రకటన తెలియజేసింది. అంతిమ యాత్ర మధ్యాహ్నం 2 తర్వాత ప్రారంభమవుతుందని, అంత్యక్రియలు విలే పార్లె సేవా సమాజ్ క్రిమిటోరియంలో సాయంత్రం 3.30 ప్రాంతంలో జరుగుతాయని వెల్లడించింది.
నివాళులు అర్పించడానికి మీడియా సభ్యులు కూడా రావచ్చని, అయితే కెమెరాలు, రికార్డింగ్ ఉపకరణాలు బయట వదిలేసి రావాలని తెలిపింది. ఈ విషాద సమయంలో అండగా నిలిచిన మీడియాకు, సినీపరిశ్రమకు, శ్రీదేవి అభిమానులకు ఖుషి, జాన్వి, బోనీ కపూర్, కపూర్, అయ్యప్పన్ కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు తమ అభిమాన కథానాయికకు కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబయిలోని ఆమె నివాసం వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పవన్హాన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.