పార్లమెంట్‌లో ప్రతిపక్షాల రభస.. ప్రధాని మోదీ ఆగ్రహం..

146
PM Modi
- Advertisement -

తొలి రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష రచ్చ చేశారు. కొత్త మంత్రులను పరిచయం చేసేందుకు మోదీ లేచీలేవంగానే నినాదాలతో హోరెత్తించారు. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో ప్రధాని మోదీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న మ‌ధ్యే.. ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు మంత్రులుగా అవకాశం రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వారంతా మంత్రులుగా ప్రమాణం చేయడాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా, గర్వంగా భావించాలని అన్నారు. కొత్త మంత్రుల్లో కొందరు రైతుల బిడ్డలున్నారని, మరికొందరు ఓబీసీ వర్గాలకు చెందిన వారని మోదీ తెలిపారు.

ఆ తర్వాత రాజ్యసభలోనూ ప్రతిపక్షాల నుంచి అదే నిరసన ఎదురైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల వారు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు మంత్రులవడాన్ని గౌరవంగా భావించాలన్నారు. కానీ, మహిళా వ్యతిరేక భావాలున్న కొందరు.. మహిళా మంత్రులను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారని, పార్లమెంట్‌లో అలాంటి వారిని తానెప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. కొత్తగా మంత్రులైన వారి జాబితాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేసిన ప్రధాని.. వారిని పరిచయం చేసే అవకాశం కల్పించవలసిందిగా కోరారు. దానిని ఆమోదిస్తున్నట్టు ఉభయ సభలు ప్రకటించాయి.

‘‘మీరు కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కదా. సభ గౌరవాన్ని దిగజార్చకండి. మంచి సంప్రదాయాన్ని మీరు నాశనం చేస్తున్నారు. కొంచెం సభా మర్యాద పాటించండి’’ అని ప్రతిపక్ష ఎంపీలకు మోదీ సూచించారు. కొత్త మంత్రులను పరిచయం చేయనివ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడం 24 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు పదే పదే రభస చేయడంతో లోక్ సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు.

- Advertisement -