ఘనంగా సిలికానాంధ్ర ఉగాది వేడుకలు

225
Silicon Andhra - Ugadi Celebrations
- Advertisement -

కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్ నగరం లోని సిలికానాంధ్ర యూనివర్సిటీ , లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం లో  ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన శ్రీ హేమలంబ నామ ఉగాది ఉత్సవం లో రెండు విభిన్న కార్యక్రమాలు, పంచ ఘట లయవిన్యాసం, వాద్య సంగీత గోష్టి (ఫ్యుజన్)  కార్యక్రమాలు ప్రేక్షకులను ఆనంద పారవశ్యం తో ఓలలాడించాయి.

ప్రపంచ ప్రఖ్యాత ఘటవాయిద్య  విద్వాంసులు , పద్మభూషణ్ శ్రీ విక్కు వినాయకరాం, తన శిష్య బృందంతో నిర్వహించిన ‘పంచ ఘట నాదలయ విన్యాసం’ తో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ  ప్రాంగణం  పరవశించింది. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమం లో శ్రీ విక్కు వినాయకరాం మాట్లాడుతూ, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో,  ఒక పవిత్రతో కూడిన దివ్యత్వం ఉన్నట్టుగా అనుభూతి  కలుగుతోందని అన్నారు. విశ్వవిద్యాలయం ఏ ఆశయం కోసం ప్రారంభించారో అది తప్పక నెరవేరుతుందని, తానూ ఇందులో భాగమై, విద్యార్ధులకు విద్య నేర్పడానికి సిద్ధం అని ప్రకటిస్తూ, తాను కచేరీ చేసే ఘటం ని సంతకం చేసి తన కానుకగా అందజేసారు. అనంతరం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం రాబోయే ఫాల్ సెమెస్టర్ కరపత్రాలు, గోడపత్రికను పద్మభూషణ్ విక్కు వినాయకరాం ఆవిష్కరించి, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారికి, యూనివర్సిటీ కార్యవర్గానికి  అందజేశారు.

Silicon Andhra - Ugadi Celebrations

బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి గారిచే హేమలంబ ఉగాది పంచాంగ పఠనం తో సాయంత్రపు ఉగాది వేడుకలు ప్రారంభైనాయి. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం  శ్రీ మధు ప్రఖ్య సంధాతగా,ఎంతో ఆసక్తిగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా పిల్లలకు నిర్వహించిన ‘భాషా వికాస పోటీల’ విజేతలకు బహుమతులు అందజేసారు.  తదనంతరం , హైదరాబాద్ నుంచి విచ్చేసిన  అన్నవరపు రామస్వామి గారి శిష్యులు ‘దేవన్ డ్రోన్ ‘ గా చిరపరిచితులైన,  కళాకారులు వయోలిన్ వాసుదేవన్, ఫ్లూట్ ఫణిలు నిర్వహించిన వాయులీన-వేణుగాన ‘నాదామృత వర్షిణి’ కార్యక్రమం  ప్రేక్షకులను ఆసాంతం ఉర్రూతలూగించింది. సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ,  యువతే రేపటి భవిత అనే సిద్ధాంతం సిలికానాంధ ఎల్లప్పుడూ నమ్ముతుందని, అందుకే ప్రతిభావంతులైన యువ కళాకారులను ఎల్లప్పుడూ సిలినాంధ్ర వేదిక స్వాగతం పలుకుతుందని అన్నారు.

ఇదే వేదికపై,  MJ తాటిపాముల, ఫణిమాధవ్ కస్తూరి సిద్ధం చేసిన సిలికానాంధ్ర అంతర్జాల పత్రిక ‘సుజనరంజని’ కొత్త పోర్టల్ విడుదల చేసారు. రత్నమాల వంక, మాధవ కిడాంబి, పద్మ హరి, సిద్దార్ధ్ నూకల, సాయి కందుల ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల,    తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -