టీఆర్ఎస్‌లోకి సబిత..చేరిక లాంఛనమే..!

280
sabitha
- Advertisement -

మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరిక లాంఛనమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా సబితా పార్టీ మారుతారనే ఉహాగానాలు వెలువుడుతన్న ఆమె ఎప్పుడు ఖండించలేదు. అయితే మరోసారి ఆమె పార్టీ మారుతున్నారనే వార్త స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తి,కొడుకు కార్తీక్ రెడ్డి భవిష్యత్‌ కోసం త్వరలోనే పార్టీ వీడననున్నారని తెలుస్తోంది.

వైఎస్ హయాంలో చెవేళ్ల చెల్లెమ్మగా వెలుగు వెలిగింది సబిత. వైఎస్ మరణం తర్వాత రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన సబితా 2014 జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కార్తీక్‌ కోసం తన సీటును త్యాగం చేసింది. ఒక కుటుంబం నుండి ఒక్కరే పోటీచేయాలనే నిబంధనతో మహేశ్వరం సీటును వదులుకుని కార్తీక్‌ రెడ్డిని చేవెళ్ల ఎంపీగా బరిలోకి దింపింది. అయితే కార్తీక్‌కు ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు.

ఇక 2018 ఎన్నికల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. రాజేంద్రనగర్‌ నుండి బరిలోకి దిగాలనుకున్న కార్తీక్‌ చాలాకాలంగా గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేసుకున్నారు. అయితే, మ‌ళ్లీ కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధ‌న‌తో కార్తీక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఓ ద‌శ‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి కార్తీక్ మొగ్గు చూపారు. కానీ చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ద‌క్కుతుందనే హామీతో వెనక్కితగ్గారు.

అయితే తీరా ఎన్నికల ముందు సీన్ రీవర్సైంది. చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఆయనకే సీటు కన్ఫామ్ కావడంతో కార్తీక్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో సబిత,కార్తీక్ ఇద్దరు అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రాహుల్ చేవెళ్ల సభ సన్నాహక సమావేశాలకు సైతం హాజరుకావడం లేదు.

ఈ నేపథ్యంలో వారు పార్టీమారడం ఖాయమేనని టాక్‌. సబిత దగ్గరి బంధువైన మాజీ మంత్రి మహేంద‌ర్ రెడ్డితో ఇప్పటికే చర్చలు జరిపారని టీఆర్ఎస్‌లో చేరితే కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ల‌భించే అవ‌కాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సబిత టీఆర్ఎస్‌లో చేరడంపై అధికారిక ప్రకటన వెలువడితే కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌ తగలడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -