నేను శైలజ సినిమాతో తిరిగి ఫామ్లోకి వచ్చిన యంగ్ హీరో రామ్. తర్వాత వచ్చిన హైపర్తో తడబడ్డ తన కెరీర్ని గాడిలో పెట్టేందుకు ఉన్నది ఒకటే జిందగీ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. స్రవంతి రవికిశోర్ సమర్పణలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన అనుమపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నేను శైలజ హిట్ కావడంతో మరోసారి రామ్.. కిశోర్పై నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ:
స్నేహం, ప్రేమకథల ఆధారంగా తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీ ఈ చిత్రం. హీరో రామ్కి స్నేహమంటే ప్రాణం. రామ్,వాసు(శ్రీ విష్ణు) ప్రాణ స్నేహితులు. వాసు కోసం రామ్ ఏంచేయడానికైనా వెనుకాడడు. ఈ క్రమంలో హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి మహా(అనుపమ) ఎంటరవుతుంది. ఇద్దరు మహాకి ప్రపోజ్ చేస్తారు. కానీ మహా ..వాసుకి ఓకే చెబుతుంది. ఈక్రమంలో వాసు..మహాకే ఎక్కువ వాల్యూ ఇస్తుండటంతో రామ్ వాసు నుంచి దూరంగా వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరుగుతుంది..? తిరిగి వీళ్లు కలుసుకున్నారా లేదా అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, హీరో రామ్, సంగీతం. తన ఎనర్జిటిక్ నటనతో రామ్ మరోసారి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో రామ్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వాసు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. అనుపమ పరమేశ్వరన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పెళ్లి చూపులు ఫేం.. ప్రియదర్శి మరోసారి నవ్వులు పూయించాడు. సెకండాఫ్లో లావణ్య గ్లామర్ షోతో ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ స్లో నేరేషన్,ఫస్టాఫ్. ఇంటర్వెల్ వరకు కథలో పెద్దగా ట్విస్ట్లు లేకుండా ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలతో లాగించాడు. ఫస్టాఫ్ కథ వేగంగా నడిచి ఉంటే బాగుండనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. ప్రేమ, స్నేహంల మధ్య కిశోర్ రాసుకున్న కథ మరోసారి ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్లో దర్శకుని పనితనం కనిపిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి వంకలు పెట్టలేం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. స్రవంతి
కిశోర్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
హైపర్ ప్లాప్ తర్వాత రామ్ మరోసారి కిశోర్ తిరుమలపై నమ్మకంతో చేసిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. హీరో రామ్ నటన, ఎమోషనల్ సీన్స్,దేవీ శ్రీ సంగీతం సినిమాకు ప్లస్ కాగా స్లో నేరేషన్ సినిమాకు మైనస్ పాయింట్స్. స్నేహం గురించి ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకుని దర్శకుడు కిషోర్ తిరుమల ఒక ఎమోషనల్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడు. మొత్తంగా నేనే శైలజ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విడుదల తేదీ: 27/10/2017
రేటింగ్: 3/5
నటీనటులు:రామ్,అనుపమ పరమేశ్వరన్,లావణ్య త్రిపాఠి
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత:స్రవంతి కిషోర్
దర్శకత్వం : కిశోర్ తిరుమల