కాషాయకోటలో రేవంత్ రెడ్డి కోవర్ట్‌లు..!

82
bjp
- Advertisement -

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన కోవర్టులను కమలం గూటికి పంపారా…. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత చేరిన కాంగ్రెస్ కీలక నేతలు కాషాయపార్టీలో కోవర్ట్‌లుగా వ్యవహరిస్తూ పార్టీ అంతర్గత రహస్యాలు రేవంత్‌కు చేరవేస్తున్నారా…హుజురాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా రేవంత్ రెడ్డి కోవర్ట్‌గా కాషాయ పార్టీని దెబ్బ తీస్తున్నాడా….ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి కోవర్ట్‌లుగా వ్యవహరిస్తూ పార్టీని దెబ్బతీస్తున్నారనేలా బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి పేరాల శేఖర్‌రావు రాసిన లేఖ కమలం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల లింగోజీగూడ డివిజన్ విషయంలో బీజేపీ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిసిన సంఘటనలో తనను బలిపశువును చేస్తున్నారంటూ శేఖర్‌జీగా పిలుచుకునే బీజేపీ సీనియర్ నేత, మాజీ జాతీయ కార్యదర్శి పేరాల శేఖర్‌రావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, సంఘ్ పరివార్ పెద్దలకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాసిన లేఖ కాషాయ పార్టీలో సంచలనంగా మారింది.

ఆ లేఖలో బీజేపీలో కొందరు నేతలు తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం లంగా దందాలు, లోపాయి కారీ వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ శేఖర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావాలనే ఈటల రాజేందర్ గెలుపు కోసం బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపాడని , ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డితో కుమ్మక్కై పార్టీలో కోవర్ట్ వ్యవహరాలు నడుపుతున్నారని, ఎన్నో ఏళ్లుగా కాషాయ జెండా మోస్తున్న కీలక నేతలను, కార్యకర్తలను పార్టీ నుంచి వెళ‌్లగొడుతున్నట్లు తెలంగాణ బీజేపీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని దెబ్బతీయాలన్న రేవంత్ రెడ్డి కుట్రలను ఈటల రాజేందర్ అమలు చేస్తున్నాడని, ఆ కుట్రలో భాగంగానే ఈటల రాజేందర్ విజయవంతంగా హుజురాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి, ఆయన వందలాది మంది అనుచరులను పార్టీ నుంచి వెళ్లగొట్టాడని కాషాయపార్టీలో చర్చ జరుగుతోంది.

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీలో కీలక నేతగా ఎదుగుతాడని, కాని రేవంత్ కోవర్ట్‌గా బీజేపీని దెబ్బతీసేందుకే ఈటల పని చేస్తాడని కాషాయ సీనియర్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈటల పార్టీపై అభిమానంతో చేరలేదని, తనపై ఉన్న కేసులు నుంచి తప్పించుకోవడం కోసం,తన వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడం కోసమే కాషాయ కండువా కప్పుకున్నాడని తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతుందంట…హుజురాబాద్‌లో ఈటల ఓడిపోతే మరుక్షణమే కోవర్ట్ ముసుగు తీసేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని బీజేపీ నేతలు భావిస్తున్నారంట..మొత్తంగా తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కోవర్టులుగా వ్యవహరిస్తూ అంతర్గత రహస్యాలను, ప్రణాళికలను ముందే చేరవేస్తున్నారంటూ పేరాల శేఖర్‌రావు రాసిన లేఖ నిజమేనని కాషాయ నేతలు అంగీకరిస్తున్నారు. మరి బండి సంజయ్ రేవంత్ రెడ్డి కోవర్టులు ఎవరో గుర్తించి వారిని ఏరిపారేయకపోతే కాషాయ పార్టీ కొంప కొల్లేరు అవడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -