బీజేపీకి ఓటేయ్యం.. ఇంటికి రావద్దు..!

84
bjp
- Advertisement -

హుజురాబాద్‌లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై హుజురాబాద్ ప్రజల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కొంప ముంచేస్తోంది. ఈటల దురంహారానికి, టీఆర్ఎస్ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కే జై కొడుతున్నరు. వుయ్ లవ్ కేసీఆర్, వుయ్ ఓట్ ఫర్ కార్ అంటూ ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలను తమ ఇండ్లకు రావద్దని ముందే ఇంటి ముందు బోర్డులు పెట్టేస్తున్నరు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఈటల అనుచరులు, కాషాయ కార్యకర్తలు తమ ఇండ్లకు రాకుండా హుజూరాబాద్‌ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్‌ఎస్‌కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ‘వంట గ్యాస్‌ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం.. దయచేసి ఇబ్బంది పెట్టకండి’ అని ఒకరు, ‘పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం’ అని మరొకరు, ‘వి లవ్‌ కేసీఆర్‌, వ వోట్‌ ఫర్‌ కార్‌’ అంటూ మరొకరు.. ఇలా రకరకాల బోర్డులు పెట్టడంతో ప్రచారానికి వచ్చిన బీజేపీ నేతలు బిత్తరపోయారు. 7వ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల ఇంటి వద్ద ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు. కిందివాడలోని 5వ వార్డు, 7వ వార్డులోనూ ఇదే విధమైన బోర్డులు దర్శనమిస్తున్నాయి. జమ్మికుంట మండలం వావిలాలలో ఓ యువకుడు బీజేపీ నాయకులు తమను ఓటు అడిగేందుకు రావొద్దని చేతులెత్తి మొక్కారు..

కేసీఆర్‌పై అభిమానంతో ఇన్నాళ్లు ఈటల అరాచకాలు భరించామని, బాహుబలిలాంటి కేసీఆర్‌కే వెన్నుపోటు పొడవాలని చూసిన కాషాయ కట్టప్ప ఈటల రాజేందర్‌ను క్షమించేది లేదని, తమకు సెంటిమెంట్‌ కంటే అభివృద్ధి ముఖ్యమని హుజురాబాద్ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నరు. ఇన్నాళ్లు హుజురాబాద్‌లో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలను వేధించిన ఈటలను ఓడించి, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హుజురాబాద్ ప్రజలు అంటున్నరు. అందుకే ఈటల అనుచరుల ప్రలోభాలకు లొంగకుండా ముందే తమ ఇండ్లకు రావద్దని బోర్డులు పెట్టి మరీ తమ నిరసనను తెలియజేస్తున్నారు. మొత్తంగా హుజురాబాద్‌ ప్రజల్లో ఈటల రాజేందర్‌పై ఉన్న వ్యతిరేకత ఈటల అనుచరులు, బండి బ్యాచ్‌కు షాకింగ్‌గా మారింది. ఇక ఈటలను ఆ దేవుడే దిగి వచ్చినా గెలిపించలేడని హుజురాబాద్ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

- Advertisement -