కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారతదేశాన్ని ప్రపంచ లీడర్గా నిలబెట్టేందుకు మరియు సరికొత్త ఇంధన వనరుల ద్వారా దేశంలో ఇంధన స్వయంసమృద్ధిని సాధించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ప్రతిష్టాత్మక ప్రణాళికలను వెల్లడించింది. ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమైనవని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాంకేతిక రంగంలో భారతదేశం కేవలం వేరే దేశాలు సృష్టించిన సాంకేతికతను వినియోగించే వినియోగదారుడిలా మాత్రమే ఉండిపోకూడదని, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే ఆవిష్కరణలను సృష్టించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం కేవలం వేరే చోట సృష్టించబడిన AIని వాడుకునే దేశంగా ఉండకూడదు. AIని సృష్టించేదిగా… స్వీకరించేదిగా మరియు ఈ రంగంలో ప్రపంచ లీడర్గా ఎదగాలి అని అంబానీ ఆకాంక్షించారు.
రిలయన్స్ తన సరికొత్త వృద్ధి ఇంజిన్గా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. దీని ముఖ్య ఉద్దేశం దేశీయ డిజిటల్ మరియు సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడమేనని అంబానీ తెలిపారు. వినియోగదారులు, పెద్ద సంస్థలు మరియు ప్రభుత్వాల అవసరాలను తీర్చే విధంగా భారీ స్థాయిలో లాభదాయకమైన AI ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫారమ్లు మరియు సేవల వ్యాపారాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఇందుకు అవసరమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఇప్పటికే గూగుల్, మెటా మరియు ఎన్విడియా సంస్థలతో రిలయన్స్ కుదుర్చుకుందని … ప్రస్తుతం ఈ వ్యూహం అమలు దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు.
ఒక దశాబ్దం క్రితం రిలయన్స్ జియో (Jio) ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, ఇప్పుడు అదే తరహాలో ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ ద్వారా దేశంలో ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా AIని అందుబాటులోకి తీసుకువస్తామని ముకేశ్ అంబానీ హామీ ఇచ్చారు.
Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్
ఈ సందర్భంగా యువ ఆవిష్కర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, మానవాళికి ఉపయోగపడే, శక్తివంతమైన, సురక్షితమైన మరియు ప్రతి భారతీయ భాషలో అనర్గళంగా పనిచేసే సరసమైన AI పరిష్కారాలను రూపొందించాలని కోరారు. రైతులు, విద్యార్థులు, వైద్యులు, కార్మికులు మరియు చిన్న వ్యాపారస్తులను సాధికారం చేసే విధంగా, దేశంలో ఉత్పాదకతను మరియు ఉపాధి అవకాశాలను పెంచేలా ఈ సాంకేతికత ఉండాలని సూచించారు.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, తాము దేశీయంగా భారీ స్థాయిలో సావరిన్ AI (Sovereign AI) సామర్థ్యాలను నిర్మిస్తున్నామని…ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ను ప్రపంచంలోనే అతిపెద్ద AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫారమ్లలో ఒకటిగా నిలబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

