ఓ వైపు ఎండిపోతున్న పంటలు… మరోవైపు రంగనాయకసాగర్లో అడుగంటుతున్న జలాలు.. ఈ పరిస్థితిని చూసి దిగాలుగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది.
మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని హరీశ్ రావు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందన లేకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడారు. రైతుల కష్టాల గురించి క్షుణ్ణంగా చర్చించారు. వెంటనే నీరు ఎత్తిపోయకుంటే 50వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని.. రైతులంతా తీవ్రస్థాయిలో నష్టపోతారని.. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
యాసంగి పంట చేతికొచ్చేదాకా సాగునీటిని అందుబాటులో ఉంచాలని… గడిచిన నాలుగేళ్ల పాటు సాగునీరు అందించిన తీరును వివరించారు. కనీసం 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని కోరారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయకసాగర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోయడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. ఎందుకూ పనికిరాదని విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగాలైన అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తూ పంటలకు నీరందిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
Also Read:కాంగ్రెస్..కరెంట్,నీళ్లు, రైతు బంధు రాదు!

