ఇటివలే రసవత్తరంగా జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మా మాజీ అధ్యక్షుడు శివాజి రాజా పై 69ఓట్లతో నరేష్ ఘన విజయం సాధించాడు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. అయితే మొదటి రోజే మా సభ్యుల మధ్య మాటల యుద్దం నడిచింది. ప్రమాణస్వీకారం అనంతరం నరేష్ మట్లాడుతూ నేను అసోసియేషన్ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను అని చెప్పారు. నరేష్ మాట్లాడిన తీరును తప్పబట్టారు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్. నరేశ్ మాట్లాడిన ప్రతి మాటలో ‘నేను’ అనే పదం ఉందని.. ఎక్కడా ‘మేము’ అని ఆయన పేర్కొనలేదంటూ రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అందరం కలిసి ఈ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డాం అని గుర్తు చేశారు. ‘మా’ అధ్యక్షుడు నరేశ్ పదే పదే ‘నేను నేను’ అన్న మాట వాడడంపై తాను అభ్యంతరం చెబుతున్నాను అన్నారు రాజశేఖర్. నరేశ్ మున్ముందు మాట్లాడేటప్పుడు ‘నేను’ అని కాకుండా ‘మేము’ అని మాట్లాడితే బాగుంటుంది అన్నారు రాజశేఖర్. అయితే తాను సరదాగా మాట్లాడానని రాజశేఖర్ని సముదాయించేందుకు ప్రయత్నించారు నరేష్. ప్రమాణస్వీకారం తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ హేమ మాట్లాడుండగానే మధ్యలోనే మైక్ ను లాగేసుకున్నారు మా అధ్యక్షుడు నరేష్. దీంతో మా ప్రెసిడెంట్ పై నరేష్ ఇలా చేయడం మంచిది కాదన్నారు హేమ. అందరం కలిసి మా కోసం కష్టపడాలని చెప్పారు హేమ. ఈ కార్యక్రమానికి మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా కొత్తగా ఎన్నికైన కమిటికి ఆయన శుభాకాంక్షాలు తెలిపారు.