నేపాల్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఓ నైట్ క్లబ్లో ఉన్న వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మయన్మార్ నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె మ్యారేజ్కు రాహుల్ను ఆహ్వానించగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ వీడియో వైరల్ కాగా బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
కాంగ్రెస్ అధికారం కొనసాగిస్తోన్న రాజస్థాన్లో ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్నాయి. జోధ్పూర్లో మత ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్గాంధీ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారని తన పార్టీకి, దేశ ప్రజలకు అవసరమైనప్పుడు నేపాల్లో రాహుల్ ఏం చేస్తున్నారో చూడాలని విమర్శలు గుప్పించారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. స్నేహితురాలి పెళ్లికి రాహుల్ వెళ్తే తప్పేంటని..స్నేహం చేయడం నేరమని బీజేపీ నిర్ణయించిందేమో అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ట్వీట్ చేశారు. 2015లో ప్రధాని మోదీ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె వివాహానికి హాజరుకాలేదా అని ప్రశ్నించారు.
ఇక అంతటితో ఆగని కాంగ్రెస్ నేతలు కౌంటర్కు దిగారు. బీజేపీ నేతల పార్టీ వీడియోలను బయటకు తీస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్ జవ్డేకర్ ఓ పార్టీలో షాంపైన్ బాటిల్ పట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ మరికొంతమంది నేతల ఫోటోలను బయటపెట్టే పనిలో ఉన్నారు. మొత్తంగా రాహుల్ నేపాల్ టూర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.