యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీల విధింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికన్ పేమెంట్ కంపెనీల ఒత్తిడికి లొంగిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఐపై రుసుములు విధించేలా దారులు సుగమం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
యూపీఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేసేందుకు మోదీ ప్రభుత్వం దొంగచాటుగా తలుపులు తెరిచిందని రాహుల్ గాంధీ విమర్శించారు. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార (మర్చంట్) లావాదేవీలపై ఎమ్డీఆర్ (MDR) విధించడానికి అనుమతి ఇస్తున్నారని పేర్కొన్నారు.ఈ లావాదేవీలు మొత్తం యూపీఐ సంఖ్యలో 5 శాతమే అయినప్పటికీ, మొత్తం విలువల పరంగా (Value) 65 శాతం వరకు ఉంటాయని స్పష్టం చేశారు. వినియోగదారుల నుండి నేరుగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వ్యాపారులపై పడే ఈ భారం చివరికి వస్తువుల ధరల రూపంలో వినియోగదారుల జేబుల నుంచే వస్తుందని ఆయన ధ్వజమెత్తారు.
భారతదేశం అమలు చేస్తున్న ‘జీరో ఎమ్డీఆర్’ (Zero-MDR) విధానాన్ని అమెరికా పేమెంట్ కంపెనీలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. అమెరికా ఒత్తిడికి లొంగిపోయిన ప్రధాని మోదీ, ఆ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా తన నిర్ణయాలను మార్చుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.
మరొకవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా స్పందిస్తూ ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న ప్రజలపై డిజిటల్ పేమెంట్స్ పన్ను వేసి వారి పొదుపును నాశనం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

