పెగాసస్ స్పైవేర్…రాజద్రోహం: రాహుల్ గాంధీ

151
rahul
- Advertisement -

పెగాస‌స్ వ్య‌వ‌హారం జాతీయవాదానికి చెందిన‌ద‌ని, రాజ‌ద్రోహం కూడా ఉన్న‌ట్లు ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి మాట్లాడిన రాహుల్‌..ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు. పెగాస‌స్ వ్య‌వహారం కేవ‌లం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీకి సంబంధించిన కాదు అని, అది జాతీయ భ‌ద్ర‌త‌కు చెందుతుంద‌ని ఆర్జేడీ నేత మ‌నోజ్ జా, శివ‌సేన నేత సంజ‌య్ రౌత్‌లు తెలిపారు.

ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాద‌వ్ మాట్లాడుతూ.. పెగాసస్ అంశంపై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని, కానీ ప్ర‌భుత్వం త‌ప్పుడు ఎజెండాను ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఇది జాతీయ భ‌ద్ర‌త‌కు చెందిన అంశ‌మ‌న్నారు. మంత్రుల భార్య‌లు, పిల్ల‌ల్ని కూడా హ్యాక్ చేసిన‌ట్లు ఆమె ఆరోపించారు.

డీఎంకే ఎంపీ టీఆర్ బాలూ మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చ‌ల‌ను అడ్డుకుంటున్న‌ట్లు త‌ప్పుడు సందేశాల‌ను ప్ర‌భుత్వం పంపుతోంద‌ని, కానీ దాంట్లో నిజం లేద‌ని, తాము ఎప్ప‌టిక‌ప్పుడు నోటీసులు ఇస్తున్నామ‌ని, కానీ ప్ర‌భుత్వానికి ఈ అంశంపై చ‌ర్చ చేప‌ట్టేందుకు సుముఖంగా లేద‌న్నారు. ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లు బాలు ఆరోపించారు. కేవ‌లం రాజ‌కీయ‌వేత్త‌లు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పైన మాత్ర‌మే కాదు, ప్ర‌తి ఒక్క‌రిపై పెగాస‌స్ ప్ర‌భావం చూపుతోంద‌ని బాలూ తెలిపారు.స‌భా కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగాలంటే, దానికి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌న్నారు. హిట్ల‌ర్ పాలించిన జ‌ర్మ‌నీ త‌ర‌హాలో మ‌న దేశం మారుతోంద‌ని సీపీఐ నేత బిన‌య్ విశ్వ‌మ్ తెలిపారు.

- Advertisement -