Modi:పుతిన్‌కు భగవద్గీత బహుకరణ

6
- Advertisement -

భారత్ పర్యటనలో రెండో రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పుతిన్‌కు భగవద్గీత గ్రంథాన్ని బహూకరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక ఇవాళ రెండోరోజు పర్యటనలో భాగంగా హైదరాబాద్ హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ, రాష్టప్రతి భవన్‌లో ఘన స్వాగతం, భారత్–రష్యా వార్షిక వ్యాపార సదస్సులో పాల్గొనడం వంటి సమావేశాలు జరుగనున్నాయి.

గురువారం రాత్రి భారత్‌కు చేరుకున్న పుతిన్ సుమారు 27 గంటల పర్యటనను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వైపాక్షిక స్నేహాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం. న్యూఢిల్లీ పాలం విమానాశ్రయంలో మోదీ స్వయంగా పుతిన్‌ను ఆలింగనం చేసి స్వాగతించడం ఈ పర్యటనకు భారత్ ఇచ్చిన ప్రాముఖ్యతను స్పష్టం చేసింది. ఇది పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత్‌కు చేసిన మొదటి పర్యటన.

విమానాశ్రయం నుంచి ఇద్దరు నాయకులు ఒకే వాహనంలో బయలుదేరారు. గత సంవత్సరం జూలైలో మోదీ మాస్కో పర్యటన సమయంలో పుతిన్ ఇచ్చిన అతిథ్యానికి ప్రతిస్పందనగా మోదీ ఈ సాయంత్రం పుతిన్‌కు ప్రైవేట్ విందు ఇచ్చారు.

“నా స్నేహితుడు, అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ సాయంత్రం మరియు రేపు జరగబోయే మా చర్చలను ఎదురుచూస్తున్నాను. భారత్–రష్యా స్నేహం కాలానుగుణంగా నిలిచింది మరియు మా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది,” అని మోదీ స్వాగత సందేశంలో పేర్కొన్నారు.

పుతిన్ భారత్ పర్యటన: రెండో రోజు పూర్తి షెడ్యూల్

11:00 AM: రాజ్‌ఘాట్‌ పర్యటన – మహాత్మా గాంధికి నివాళులు
11:30 AM: రాష్టప్రతి భవన్‌లో ఘన స్వాగతం
11:50 AM: హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో సమావేశం
1:50 PM: హైదరాబాద్ హౌస్‌లో సంయుక్త పత్రికా సమావేశం
3:40 PM: భారత్–రష్యా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రసంగం
7:00 PM: రాష్టప్రతి ద్రౌపది ముర్ముతో భేటీ, రాష్టప్రతి భవన్
9:00 PM: రష్యాకు బయలుదేరడం

నిపుణులు పుతిన్ పర్యటన ద్వారా రక్షణ, వాణిజ్యం, విజ్ఞానం–సాంకేతికత, సాంస్కృతిక–మానవతా రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. భారత మాజీ రాయబారి అరుణ్ సింగ్ మాట్లాడుతూ, గత ఎన్నో దశాబ్దాలుగా భారత్‌కు రష్యా ఇచ్చిన రాజకీయ–రక్షణ మద్దతు ఈ భాగస్వామ్యానికి బలమని వ్యాఖ్యానించారు.

Also Read:BB9:ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కళ్యాణ్!

భారత్‌కు ముఖ్యమైన ప్రాధాన్యత రష్యా చమురు దిగుమతుల పెరుగుదలతో ఏర్పడిన భారీ వాణిజ్య అసమతౌల్యాన్ని తగ్గించడం. ఈ సదస్సు ద్వారా భారతీయ ఎగుమతులను విస్తరించేందుకు మార్గం సుగమం కానుంది. యూరప్‌పై ఆధారాన్ని తగ్గించాలనే రష్యా ఉద్దేశాన్ని ప్రతిబింబించేలా భారీ వ్యాపార ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. షిప్పింగ్, ఆరోగ్యం, ఎరువులు, కనెక్టివిటీ వంటి రంగాల్లో ప్రభుత్వ–అంతర ప్రభుత్వ ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు కుదరనున్నాయి.

- Advertisement -