పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారు పదవికి రాజీనామా చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ మేరకు రాజీనామా లేఖను అమరీందర్ సింగ్కు పంపించారు ప్రశాంత్.
ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా తాను తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మీ ప్రిన్సిపల్ అడ్వైజర్గా బాధ్యతలు స్వీకరించలేకపోయాను. నా భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా నిర్ణయం తీసుకోనందున, దయచేసి నన్ను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయమని మిమ్మల్ని కోరుతున్నాను అని అమరీందర్ సింగ్కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.