పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత సాయుధ దళాల ధైర్యాన్ని మరియు సంకల్పాన్ని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపిన దానికి ప్రతిస్పందనగా ఈ మిషన్ ప్రారంభించబడింది.
ఏడాది క్రితం మన సాయుధ దళాలు #OperationSindoor ద్వారా అసమానమైన ధైర్యం మరియు ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాయి. పహల్గామ్లో అమాయక భారతీయులపై దాడికి తెగబడిన వారికి తగిన సమాధానం ఇచ్చారు. వారి వీరత్వానికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది అని ప్రధాని ‘X’ వేదికగా పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ భారత్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక దృక్పథాన్ని మరియు జాతీయ భద్రతను కాపాడటంలో రాజీలేని పట్టుదలను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధి వల్ల మన సాయుధ దళాల సన్నద్ధత మరియు బలం పెరిగిందని ప్రధాని గుర్తుచేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతా డిస్ప్లే పిక్చర్ను (DP) ‘ఆపరేషన్ సింధూర్’ గుర్తుగా మార్చారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సందర్భంగా సాయుధ దళాల త్యాగాలను స్మరించుకున్నారు. ఆధునిక సైనిక కార్యకలాపాలకు ‘ఆపరేషన్ సింధూర్’ ఒక బెంచ్మార్క్గా నిలుస్తుందని ఆయన అన్నారు. అలాగే, దేశంపై ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా సమాధానం చెప్పేందుకు మన దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన భారత వైమానిక దళం (IAF), మిషన్లోని ముఖ్యమైన క్షణాలను చూపే వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. అదే వీడియోను భారత సైన్యంకూడా షేర్ చేస్తూ పాకిస్థాన్కు భారత్ పంపిన స్పష్టమైన సందేశాన్ని గుర్తుచేసింది.
Also Read:‘ఇంపాక్ట్ ప్లేయర్’..రక్షణ కవచం మాత్రమేనా?

