జులై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సారి సమావేశాలు వాడివేడిగా జరగనుండగా పలు కీలక బిల్లులను తీసుకురానుంది ఎన్డీయే సర్కార్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు నీట్ పేపర్ లీక్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తుండగా.. కీలక బిల్లులను సజావుగా ఆమోదింపజేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సన్నాహాల మధ్య, ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్న బిల్లుల జాబితా బయటకు వచ్చింది.
ప్రవేశపెట్టే అవకాశం ఉన్న ఐదు కొత్త బిల్లులు..
ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు, 2026 (ఆర్డినెన్స్ స్థానంలో తీసుకురానున్న బిల్లు).
సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026 (ఆర్డినెన్స్ స్థానంలో తీసుకురానున్న బిల్లు).
జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026.
జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (MSME) (సవరణ) బిల్లు, 2026.
ఈ వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వ శాసనసభ ఎజెండాలో ఈ బిల్లులే అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు.
అలాగే కొత్త బిల్లులతో పాటు, పార్లమెంట్లో ఇప్పటికే పెండింగ్లో ఉన్న రెండు బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం చర్చకు తీసుకునే అవకాశం ఉంది.
విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026: దీనిని మార్చి 25, 2026 న లోక్సభలో ప్రవేశపెట్టారు.వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, 2025: దీనిని డిసెంబర్ 15, 2025 న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తదుపరి పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కి పంపించారు.
Also Read:హోర్ముజ్ జలసంధి..కేంద్రం కీలక ఆదేశాలు
ప్రభుత్వ అధికారిక బిల్లుల జాబితాలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు లేదా ఒకే దేశం – ఒకే ఎన్నిక లేనప్పటికీ, ఈ రెండు ప్రతిపాదనలు ఈ సమావేశాల కంటే ముందే పెద్ద ఎత్తున రాజకీయ చర్చనీయాంశాలుగా మారాయి. ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఒకవేళ పార్లమెంట్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెడితే తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.

