ముందు జాగ్రత్తతో ముప్పు తప్పింది- మంత్రి ఎర్రబెల్లి

157
errabelli
- Advertisement -

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట పట్టణ సమీపంలో నున్న మాదన్నపేట చెరువును అయన శుక్రవారం మధ్యాహ్నం సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ అర్బన్,వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్,జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నమని తెలిపారు. ఈ ఆయా జిల్లాలోని జిల్లా కలెక్టర్లు, అదికారులతో వరద పరిస్థితి ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏ విధమైన నష్టం కాకుండా చూడటం జరిగిందని అయన తెలిపారు.

వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలో భారీ వర్షాల వల్ల చెరువులు నిండాయని ఆయన అన్నారు. భారీ వర్షాల వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొని ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. భారీ వర్షాలు పడుతున్నందున చేపలు పట్టడానికి జాలరులు, ప్రజలు చెరువులోకి, వాగులోకి వెళ్ళరాదని అయన కోరారు.

మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, తదితర అధికారులు ఉన్నారు. అంతకు ముందు వరంగల్ నగరంలోని నయీమ్ నగర్ ప్రాంతాన్ని, వరంగల్ రూరల్ జిల్లాలోని కటాక్షపూర్ చెరువును మంత్రి ఎర్రబెల్లి సందర్శించి భారీ వర్షాల వల్ల తీసుకుంటున్న చర్యలను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేసారు.

- Advertisement -