భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కె. అన్నామలై రాజీనామాను ఆమోదించినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం అన్నామలైని కోరినట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్కు తెరదించుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆయన రాజీనామాను ఆమోదించడంతో శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీతో కె. అన్నామలై బంధం ముగిసింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై, తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించేందుకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.
“తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కె. అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నితిన్ నబిన్ ఆమోదించారు,” అని బీజేపీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Also Read:కొత్త రూల్ తీసుకొచ్చిన UPSC!
మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన అన్నామలై, గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్లతో భేటీ అయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం.. తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బీజేపీ అధిష్టానం అన్నామలైని కోరినప్పటికీ ఆయన అందుకు మొగ్గు చూపలేదు.

