అగ్రి బిల్లుపై మంత్రి నిరంజన్‌ రెడ్డి అభ్యంతరం..

181
Niranjan Reddy
- Advertisement -

కేంద్ర వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై తీవ్ర అభ్యంతరం తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు మెడపై కేంద్రం కత్తిలా ఉన్నాయి ఈ బిల్లులు. కార్పోరేట్ల లబ్దికొరకే ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రాష్ట్రాలకు సమాచారం లేకుండా బిల్లు సమాఖ్య స్ఫూర్థికి విరుద్దమన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. తెలంగాణలో 92.05 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. ఈ బిల్లులో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఊసేలేదెందుకు ? అని ప్రశ్నించారు. రైతుల ఉత్పత్తులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే భవిష్యత్ లో కార్పోరేట్లు గుత్తాధిపత్యం పెరిగి ధరల నియంత్రణ రైతు, ప్రభుత్వాల చేయి దాటి కార్పోరేట్ శక్తుల చేతిలోకి వెళ్లదా ?..కార్పోరేట్లకు, రైతులకు వివాదాలు తలెత్తితే పరిష్కరించేదెవరు… మార్కెట్ కమిటీలకున్న మధ్యవర్తిత్వ అవకాశాన్ని ఈ బిల్లు కాలరాసింది నిజమే కదా అని మంత్రి ప్రశ్నించారు.

కొత్త బిల్లుతో మార్కెట్ కమిటీలు అలంకార ప్రాయం కానున్నాయి.. రైతుల తరపున మాట్లాడే గొంతుకలు నొక్కివేయబడ్డట్లే. వివాదాలు తలెత్తినప్పుడు సాధారణ రైతు బడా కార్పోరేట్ వ్యవస్థను ఎలా ఢీ కొనగలడు?.. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వ్యవసాయ వాణిజ్యం, సరఫరా, పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ ఉత్పత్తుల ధరల నియంత్రణ కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి పరిధిలో ఉంటాయి.. కానీ ఈ బిల్లు విషయంలో ఏకపక్షంగా ముందుకువెళ్లింది.. రాజ్యాంగ స్ఫూర్థికి విరుద్దంగా బిల్లులను ఆమోదింపచేసుకుంది.. అది కూడా రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండానే.. లాభాపేక్ష తప్ప ఏ మాత్రం మానవత్వం ఉండని విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపెనీలు, వ్యాపారులు గ్రామీణ పేద రైతాంగం మీదకు ఎగబడేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని మంత్రి తెలిపారు.

మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ఏ విధంగా భర్తీచేస్తుంది ?..నిత్యావసరచట్టం పరిధి నుండి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, నూనెగింజలు, పప్పుధాన్యాలను తొలగించడం ద్వారా కార్పోరేట్లు, దళారులకు రెడ్ కార్పెట్ పరిచినట్లే అన్నారు. ధరలు తక్కువ ఉన్పప్పుడు బ్లాక్ చేసి, వినియోగం పెరిగినప్పుడు ధరలు పెంచి అమ్ముతారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్నా ఇప్పుడే ఉల్లి ధరలను నియంత్రించలేని పరిస్థితులు ఉంటున్నాయి.. మరి ప్రభుత్వ నియంత్రణనే లేకుంటే దళారులు, కార్పోరేట్లు చెలరేగిపోరా ? అని మంత్రి ప్రశ్నించారు.

ప్రస్తుత అవసరాల రీత్యా తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను బలోపేతం చేసింది.. ఈ బిల్లు ప్రకారం గోదాంలు, మార్కెట్లను కార్పోరేట్లకు ధారాదత్తం చేసేలా ఉంది. ఈ బిల్లు మూలంగా రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకోగలరు అని చెబుతున్నది.. కానీ వారు ఇంకా అసంఘటితంగానే ఉన్నారు.. ఇది కార్పోరేట్ వ్యవస్థలు దోచుకోవడానికి తోడ్పడదా ? కేంద్రం ప్రకటించే మద్దతుధరకే చట్టబద్దత లేదు.. ఇక దేశంలో ఎక్కడైనా ధర ఉన్నచోటికి రైతులు తీసుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అన్నది ఆచరణలో సాధ్యమయ్యేదేనా ? గ్రామాలు, రాష్ట్రాలు దాటి రైతులు అమ్ముకునే పరిస్థితి లేదు.. రెక్కాడితే గాని డొక్కాడని సన్న, చిన్నకారు రైతులు తమ పంటలను నిల్వ చేసుకుని అమ్ముకునే పరిస్థితి కూడా లేదు అన్నారు.

తాజా బిల్లుతో కార్పోరేట్ వ్యవస్థ పడగవిప్పితే రైతాంగం మరింత నష్టపోయేలా ఉంది. కార్పోరేట్ వ్యవస్థ, వ్యాపారులు, రిటైల్ చైన్స్, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు, దళారులు కుమ్మక్కై రైతులకు మద్దతు ధర దక్కకుండా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు మద్దతుధర లభించేలా కేంద్రం చట్టబద్దత ఎందుకు కల్పించలేదు ? ఈ బిల్లులో ఉన్న వివాద పరిష్కార వ్యవస్థలలో స్పష్టత లేకపోగా లోప భూయిష్టంగా ఉంది.. దీనిపై రైతాంగం ఆందోళన చెందుతున్నది.

వ్యవసాయ బిల్లుతో పాటు విద్యుత్ బిల్లు లోపభూయిష్టం .. ఇది కూడా రాజ్యాంగ స్ఫూర్థికి విరుద్దం. ఈ బిల్లులు సంస్కరణలుగా లేవు.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెంచుకునే ప్రయత్నంలా ఉంది. రాష్ట్రాలు కట్టిన పన్నుల వాటాలే కేంద్రం వెనక్కు ఇవ్వడం లేదు.. కరంటు బిల్లు కడితే తిరిగి ఇస్తామనడం విడ్డూరం. రాష్ట్రాల అవసరాలను బట్టి విద్యుత్ రంగంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయి.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవడం, రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరం. తెలంగాణ సాధించుకుని వ్యవసాయం బలోపేతం చేసేందుకు గత ఆరేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం.. 26 లక్షల పంపుసెట్లకు ఉచిత కరంటు ఇస్తున్నాం.. కేంద్రం బిల్లు దీనికి విఘాతం కలిగించేలా ఉంది. మీటర్లు బిగించడం, వాటి నిర్వహణ డిస్కంలకు పెద్ద భారంలా మారుతుంది. అవసరం ఉన్న పేద రైతులకు, పేద కుటుంబాలకు రాష్ట్రాలు డిస్కంల ద్వారా క్రాస్ సబ్సిడీ భరించి కరంటును అందిస్తున్నాయి. కేంద్ర బిల్లుతో అది సాధ్యం కాదు అని మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు.

- Advertisement -